ysrcp, చంద్రబాబుతో ఉంటే.. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాలేరు: బీజేపీ – bjp leader vishnuvardhan reddy key comments on chandrababu and pawan meeting
‘బీజేపీతో ఉంటేనే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబుతో ఉంటే పవన్ సీఎం అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీకి అనేక అస్త్రాలు ఉన్నాయి. అటు వైఎస్సార్సీపీ.. ఇటు టీడీపీ చిన్నచిన్న పార్టీలను మింగేస్తాయి. అదే బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే.. పవన్ కళ్యాణ్కు లాభం. చంద్రబాబు చాలా తెలివైన రాజకీయ నాయకుడు. ఆయన టీడీపీకి మేలు చేసేందుకు వ్యూహాలు రచిస్తారు. అలాంటి వ్యక్తి వల్ల పవన్కు నష్టమే తప్ప లాభం లేదు. వైసీపీకి పక్కా స్ట్రాటజీ ఉంది. బీజేపీ-జనసేన 175 స్థానాల్లో పోటీ చేస్తుంది. టీడీపీ, వైఎస్సార్సీపీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో కలిసే ప్రసక్తే లేదు’. అని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
‘గతంలో విశాఖ ఘటన నేపథ్యంలో.. చంద్రబాబు వచ్చి పవన్కు సంఘీభావం ప్రకటించారు. అలాగే.. ఇటీవల కుప్పంలో జరిగిన ఘటనల నేపథ్యంలో.. పవన్ వెళ్లి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ఈ భేటీలో అంతకు మించి ఏమీ లేదు. కావాలనే పవన్పై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇదంతా వైఎస్సార్సీపీ వారు కావాలని చేస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే పవన్-చంద్రబాబు కలిశారు. దాని కోసమే కలిసి పోరాటం చేస్తాం. అంతకు మించి ఏమీ లేదు. ఏమైనా ఉంటే ఓపెన్గా మాట్లాడతాం. నూటికి నూరు శాతం మేము బీజేపీతోనే కలిసి పోటీ చేస్తాం’ అని జనసేన నేత బొలిశెట్టి సత్య వ్యాఖ్యానించారు.
‘బీజేపీ-జనసేన నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. చంద్రబాబు ఏం మాట్లాడారు. మిగతా పక్షాలు అన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొస్తానని అన్నారు. ఈ సమయంలో.. పవన్ బయటకు వచ్చి.. బీజేపీ, టీడీపీతో పొత్తు ఉండదని చెప్పగలరా.. చంద్రబాబును పవన్ ఇప్పటికిప్పుడు పరామర్శించాల్సిన అవసరం ఏముంది. అసలు పవన్ పరామర్శించాల్సింది ఎవరిని.. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అండగా ఉండాలి. కానీ.. చంద్రబాబును పరామర్శించిడం ఏంటి. అందుకే ముసుగు తీసి రాజకీయాలు చేయాలని అంటున్నాం. ఎంతమంది కలిసి వచ్చినా.. జగన్ను ఓడించడం కష్టం అనే విషయం వారికి కూడా తెలుసు’ అని వైఎస్సార్సీపీ ఎంపీ భరత్ వ్యాఖ్యానించారు.