News

ysr matsyakara bharosa scheme funds release, ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. నేడు ఒక్కో అకౌంట్‌లో రూ.10వేలు జమ – ap govt to release ysr matsyakara bharosa scheme funds to beneficiaries account in nizampatnam


ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్‌ మత్స్యకార భరోసా (Ysr Matsyakara Bharosa ) సాయం అందిస్తోంది. నేడు బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి ఈ ఏడాది 1,23,519 మందికి.. రూ.123.52 కోట్లు అకౌంట్‌లలో జమ చేయనున్నారు. ఒక్కొక్కరికి రూ.10వేల అకౌంట్‌లో జమ చేస్తారు. సముద్రంలో వేటపై నిషేధం ఉండటంతో మత్స్యకారులకు ఆర్థిక సాయం అందిస్తోంది.

మత్స్యకార భరోసాతో పాటూ ఓఎన్‌జీసీ పైపులైన్‌ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు కూడా రూ.108 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేయనున్నారు. నేడు సీఎం జగన్ బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నంలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మత్స్యకార భరోసా మొత్తాన్ని ఉ.11.35 గంటలకు బటన్‌నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తారు.. లబ్ధిదారులతోనూ మాట్లాడతారు.

అంతేకాదు ఆయిల్‌ సబ్సిడీని రూ.9కి పెంచారు. మత్స్యకారులకు స్మార్ట్‌ కార్డులు ఇచ్చారు. వీటి ద్వారా సబ్సిడీ మొత్తాన్ని మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని డీజిల్‌కు చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఇలా ఏటా సగటున 20 వేల బోట్లకు రూ.25 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 26 ఆక్వా హబ్‌లు.. వాటికి అనుసంధానంగా 4,000 రిటైల్‌ షాపుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. మత్స్య, ఆక్వా రైతులకు సేవలు అందించేందుకు వీలుగా వెబ్‌ అప్లికేషన్‌ ఈ–మత్స్యకార్‌తోపాటు టోల్‌ ఫ్రీ నెంబర్‌ 155251ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు.

21 నుంచి 60 వయసు లోపు మత్స్యకారులగా జీవనోపాధి పొందుతున్నవారు మాత్రమే ఈ వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకానికి అర్హులు. అలాగే అర్బన్‌ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణానికి మించి ఇల్లు ఉండకూడదు. ఈ పథకం 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట, రెండు కలిపి 10 ఎకరాలకు మించి భూమి ఉన్నవాళ్లకు వర్తించదు. అర్బన్ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలలోపు.. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండాలి. ఐటీ చెల్లించేవారు ఈ పథకానికి అర్హులు కాదు. అంతేకాదు మత్స్యకార పింఛన్, సంక్షేమ పథకాలు పొందుతున్నవారు ఈ పథకానికి అనర్హులు.

ప్రభుత్వ, ప్రభుత్వరంగ ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా అర్హులు కాదు. మత్స్యకార భరోసాకు దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, ఓటరు ఐడి కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, వృత్తి ప్రమాణ పత్రం అందించాల్సి ఉంటుంది. ప్రతి ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు సముద్రంలో వేటపై నిషేధం ఉంటుంది. ఆ సమయంలో సముద్రలో చేపలు, రొయ్యల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యల సంరక్షణ కోసం నిషేధం విధిస్తారు. అందుకే మత్స్యకార భరోసాను అర్హులకు అందజేస్తోంది.

  • Read Latest Andhra Pradesh News and Telugu News

Related Articles

Back to top button