ys jagan, అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీని వేగవంతం చేయాలి.. సీఎం జగన్ ఆదేశాలు – cm ys jagan mohan reddy review meeting over ap housing scheme
ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతమైన సీఆర్డీయే పరిధిలో పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, నాణ్యమైన పనులు చేపట్టి, లబ్ధిదారుల కల సాకారం చేయాలన్నారు.
అలాగే, ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన అనంతరం వేగంగా నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇళ్లు లేని నిరుపేదలకు సాధ్యమైనంత త్వరగా ఇళ్లు కట్టించి అప్పగించడంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు. పేద ప్రజలకు ఎంత త్వరగా ఇళ్లు సమకూరిస్తే.. వారి జీవితాలు అంతగా బాగుపడతాయని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. సీఆర్డీఏ ప్రాంతంలో పట్టాల పంపిణికీ అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ల్యాండ్ లెవలింగ్ పనులు మెదలుకొని మిగిలిన అన్ని పనులను త్వరలోనే కొలిక్కి తీసుకురావాలన్నారు.
సీఆర్డీయే ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటు నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇందులో భాగంగా 5024 టిడ్కో ఇళ్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోందని.. ఇది దేశ చరిత్రలోనే రికార్డుగా పేర్కొన్నారు. అర్హులను గుర్తించి పారదర్శకంగా ఇళ్ల పంపిణీ చేయటంలో అధికారులు కీలకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు.