News

ys avinash reddy, వైఎస్ అవినాష్ రెడ్డి పిటిషన్‌పై నేడు హైకోర్టులో తీర్పు.. వైసీపీలో తీవ్ర ఉత్కంఠ! – telangana high court will give judgment on ys avinash reddy petition


మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. వివేకా హత్య కేసులో విచారిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తనను అరెస్ట్‌ చేయకుండా చూడాలని కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హైకోర్టుకెళ్లారు. వైఎస్ అవినాష్ రెడ్డి పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. తన విచారణపై స్టే ఇవ్వాలన్న అవినాష్ రెడ్డి అభ్యర్థనపై శుక్రవారం న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ నెల 17వ తేదీన సీబీఐ విచారణకు హాజరు కావాల్సిన ఎంపీ అవినాష్ రెడ్డి.. అంతకు ఒక్కరోజు ముందే హైకోర్టు మెట్లెక్కారు.

ఈ నెల 16న తెలంగాణ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ రూపంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ ముగిసేదాకా తనను 161 సీఆర్పీసీ కింద విచారించకుండా స్టే విధించాలని కోరారు. ఈ పిటిషన్‌లో సీబీఐపై ఆయన అనేక ఆరోపణలు చేశారు. అలాగే, వివేకానందరెడ్డి కుటుంబంలో చాలా వివాదాలున్నాయని, సొంత కుటుంబం నుంచే ఆయనకు ముప్పు ఉండిందని పేర్కొన్నారు.

తన వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో రికార్డు చేయాలని వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేసినా సీబీఐ అధికారులు పట్టించుకోవడం లేదని.. జనవరి 28న, ఫిబ్రవరి 24న రెండు దఫాలు సీబీఐ తనను విచారించిందని వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. అన్ని వివరాలూ వెల్లడించినప్పటికీ.. ఇంకా ఇబ్బంది పెడుతోందన్నారు. తన స్టేట్‌మెంట్‌ను ఆడియో వీడియో రికార్డు చేయడంతో పాటు స్టేట్‌మెంట్‌ కాపీని ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. విచారణకు తనతో పాటు న్యాయవాదిని సైతం అనుమతించేలా ఆదేశించాలని తెలంగాణ హైకోర్టును అవినాష్ రెడ్డి కోరారు.

తన పిటిషన్‌పై విచారణ ముగిసే వరకు సీఆర్పీసీ సెక్షన్‌ 161 కింద సీబీఐ తనను విచారించకుండా స్టే విధించాలని.. అరెస్టు సహా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలని అవినాష్ రెడ్డి కోరారు. అవినాష్ రెడ్డి విచారణకు సంబంధించి వీడియోగ్రఫీ, ఆడియోగ్రఫీ, కేసు వివరాలను షీల్డ్ కవర్‌లో కోర్టుకు సీబీఐ సమర్పించింది. మొత్తం 35 సాక్షుల స్టేట్‌మెంట్లు, 10 డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు కోర్టుకు సమర్పించింది. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన లేఖ, ఎఫ్‌ఎస్ఎల్ నివేదిక‌ను కూడా హైకోర్టుకు సీబీఐ అందజేసింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును 17వ తేదీకి (శుక్రవారం) రిజర్వ్ చేసింది. దీంతో హైకోర్టు తీర్పుపై అవినాష్ రెడ్డితో పాటు వైసీపీలోనూ ఉత్కంఠ నెలకొంది.

Related Articles

Back to top button