visakhapatnam, Global Investors Summit: విశాఖ తీరంలో రాజకీయ దుమారం.. సమ్మిట్ వేళ ఇదేం తీరు? – dialogue war between tdp and ysrcp during global investors summit
‘ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాల్సిన పని లేదు. మేము ప్రజలకు సమాధానం చెబుతాం. గత మూడేళ్లుగా పెట్టుబడులు రావడం లేదని అనడం అవాస్తవం. ఇలాంటి సమ్మిట్లు జరగకపోవచ్చు కానీ.. పెట్టుబడులు మాత్రం ఎక్కడా ఆగలేదు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిసారీ పెట్టుబడులపై చాలా సీరియస్గా ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూనే.. అభివృద్ధిపై ఫోకస్ పెట్టాం. అందుకే.. గత ప్రభుత్వం ఐదేళ్లలో తీసుకొచ్చిన పెట్టుబడుల కంటే.. ఈ మూడున్నరేళ్లలో మేము ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చాం’ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.
‘అనంతపురంలో ఒక కియా మోటార్స్ తీసుకొచ్చి.. డబ్బా కొట్టుకుంటున్నారు. కానీ.. మేము అలా పబ్లిసిటీ చేసుకోవడం లేదు. వారు కేవలం ఒక్కదాని గురించే చెబుతున్నారు. మేము పదుల సంఖ్యలో పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చాం. ఇవన్నీ వారికి కనపడకపోవడం బాధాకరం. ఎవరికో పుట్టిన బిడ్డకు మేము పేరు పెట్టుకోం. కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భయానక వాతావరణం అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ మూడున్నరేళ్లలో ఒక్కసారైనా.. చంద్రబాబు కంపెనీలకు ఏమైనా సమస్యలు వచ్చాయా. కేవలం ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలని చూస్తున్నారు’ అని అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘అమరరాజ కంపెనీ గురించి కూడా తప్పుడు ప్రచారం చేశారు. అమరరాజ అధినేత గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీనే కదా.. ఆయన ఎప్పుడైనా ప్రభుత్వంపై కామెంట్స్ చేశారా. వ్యాపార విస్తరణలో భాగంగా.. అమరరాజ వేరే రాష్ట్రాలకు వెళ్లింది. దానికి ప్రభుత్వానికి ఏంటి సంబంధం. గతంలో 3800 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి.. చంద్రబాబు తప్పించుకున్నారు. 2900 కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. మేము ఎంఎస్ఎంఈ సెక్టార్ను కాపాడాం. నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం వంటి మాటలతో.. చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. ఆయన హయాంలో ఎవరైనా ఆత్మహత్య చేసుకోవచ్చు కానీ.. జగన్ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదు’ అని ఐటీ మంత్రి స్పష్టం చేశారు.
‘జాకీ సంస్థకు సంబంధించి.. తమ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదు. గత ప్రభుత్వం హయాంలోనే.. పరిటాల శ్రీరామ్ అక్కడ ఇబ్బందులు కలిగించారని.. జాకీ సంస్థ ప్రతినిధులే చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంలో.. అలాంటి పరిస్థితి లేదు. నిజంగానే ప్రతిపక్షాలు చెప్పిన పరిస్థితులు ఉంటే.. దేశంలోని.. ఇంత పెద్ద పారిశ్రామికవేత్తలు ఎందుకు వస్తారు. మళ్లీ దావోస్ గురించి మాట్లాడుతున్నారు.. అసలు గత ఐదేళ్లలో చంద్రబాబు దావోస్ నుంచి ఏం తీసుకొచ్చారు. మేము వచ్చాక మూడేళ్లు అసలు దావోస్ సదస్సు జరగలేదు. ఆ తర్వాత జరినప్పుడు.. స్వయంగా సీఎం జగన్ వెళ్లి పెట్టుబడులను ఆకర్షించారు’ అని గుడివాడ అమర్నాథ్ వివరించారు.
Read Latest Andhra Pradesh News and Telugu News