News

tirumala devotee donation, తిరుమల శ్రీవారికి హైదరాబాద్‌కు చెందిన భక్తుడి భారీ విరాళం – hyderabad devotee srinivasulu reddy donated rs.10 lakhs to sv annaprasadam trust of ttd


తిరుమల శ్రీవారికి భక్తుడు భారీ విరాళం అందించారు. హైదరాబాద్‌కు చెందిన భక్తుడు శ్రీనివాసులురెడ్డి టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.10 ల‌క్ష‌లు విరాళంగా అందించారు. తిరుమలలోని ఈవో క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఈ మేరకు చెక్కును అందజేశారు. భక్తుడు శ్రీనివాసులురెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

మరోవైపు తిరుపతి శ్రీ గోవింద రాజ స్వామి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శుక్రవారం రాత్రి 7 గంటల నుండి పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవిందరాజస్వామి భక్తులను క‌టాక్షించారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి మొదటి ఉత్సవం పెద్దశేషవాహనం. ఈ శేషుడు ఏడుకొండలకు, ఏడులోకాలకు సంకేతంగా ఏడుపడగలు గల ఆదిశేషుడు. వాహనరూపంలో స్వామివారిని స్తుతిస్తూ, మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు. విశ్రాంతికి సుఖనిద్రకు కారణమవుతున్నాడు. తనను, శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలె నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలితాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు అనుగ్రహిస్తారు.

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం 8.22 నుంచి 8.49 గంటల మధ్య మిథున లగ్నంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. అంతకుముందు శ్రీగోవిందరాజస్వామివారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్‌, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ట , రక్షా బంధనం చేపట్టారు. మిథున లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం ధ్వజారోహణం ఉద్దేశం.

ఏ సంస్థ అభివృద్ధి చెందాలన్నా, నాణ్యతలో రాజీపడకుండా లక్ష్యాలను సాధించడానికి ఆర్థిక క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని, గత మూడేళ్లలో ఎస్వీబీసీ ఈ ఘనత సాధించిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. ఎస్వీబీసీ కార్యాలయంలోని మీటింగ్ హాల్‌లో ఎస్వీబీసీ ఉద్యోగులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమానికి ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ్ కుమార్‌తో కలిసి ఈవో హాజరయ్యారు. ప్రస్తుత సీఈవో సమర్ధవంతంగా సమన్వయం చేసుకొని ఎస్వీబీసీ పరిపాలన, ఆర్థిక అంశాల్లోని లోపాలను అధిగమించారన్నారు.

భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను అర్థంతో బాటు ఉదహరిస్తూ, ప్రతి ఉద్యోగి సంస్థను స్వంతంగా భావించి, దాని ప్రతిష్ట కోసం కృషి చేయాలని ఈవో కోరారు. ‘సుందరకాండ, భగవద్గీత, యోగ దర్శనం మొదలైన కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎస్వీబీసీకి ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ, పేరు, ప్రఖ్యాతులు లభించాయని చెప్పారు. గత మూడు సంవత్సరాల నుండి ఎస్వీబీసీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆధ్యాత్మిక ఛానెల్‌లలో అగ్రస్థానంలో ఉందని, ప్రసారమయ్యే కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకొంటున్నాయని తెలిపారు. మనం దాదాపు 50% అనవసరమైన ఖర్చులను తగ్గించడం ద్వారా ఈ ఘనతను సాధించామని, అదే సమయంలో కార్యక్రమాల నాణ్యతలో ఎక్కడా రాజీపడలేదని, ఇదే స్ఫూర్తి తో అందురు సమిష్టి కృషితో ముందుకెళ్లాలన’ పిలుపునిచ్చారు.

అనంతరం ఆయన సీఈవోను ప్రతి నెలా సమావేశం నిర్వహించి భక్తుల కోసం ఏ విధమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను రూపొందించాలి, కార్యక్రమాల నాణ్యతను మరింతగా ఎలా పెంచాలి మరియు ఇతర పరిపాలనాపరమైన అంశాల కు సంబంధించి సిబ్బంది అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలని సూచించారు.

  • Read Latest Andhra Pradesh News and Telugu News

Related Articles

Back to top button