News

Telangana Rain Forecast,వాతావరణశాఖ కీలక అప్డేట్.. నెలాఖరు వరకు వానలే వానలు..! – imd predicts heavy rains in telangana for next two days


వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో.. ఈ నెలాఖరువరకు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలోనూ.. వచ్చే రెండ్రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అంచనా వేసింది. పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని అధికారులు వివరించారు. ఇక ఇదే సమయంలో పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3.1 డిగ్రీల అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ఇదిలా ఉంటే.. తిరోగమన సమయం దగ్గరపడటంతో నైరుతి రుతుపవనాలు పుంజుకుంటున్నాయని ఐఎండీ తెలిపింది. గురువారం నుంచి ఈ నెలాఖరు వరకు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతాయని.. దీంతో అక్టోబర్‌ మొదటి వారం వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. సెప్టెంబర్‌ 21 వ తేదీన తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో సెప్టెంబర్‌ 22 నుంచి 28 వ తారీకు వరకు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు. ఇవే కాకుండా అక్టోబర్‌ 5, 6వ తేదీల్లో కూడా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అక్టోబర్‌ 6 నుంచి 12వ తేదీ మధ్యలో నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకునే అవకాశం ఉందని వివరించింది.

రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో.. దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలకు ఎల్లో, రెడ్‌ అలర్ట్‌లను కూడా జారీ చేసింది ఐఎండీ. పశ్చిమ మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కారణంగా రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయన్నారు. తూర్పు రాజస్థాన్‌, పశ్చిమ మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఇక ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం మంగళవారం రోజు బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. దీని ప్రభావంతో మరో 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల రాయలసీమలో ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షం కురుస్తుందని చెప్పారు.

Related Articles

Back to top button