Sri Govindarajaswami Temple Maha Samprokshanam, తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయ మహాసంప్రోక్షణ ఆపండి.. ఏపీ హైకోర్టులో పిటిషన్ – devotee files petition in ap high court on tirupati sri govindaraja swamy temple maha samprokshanam
బంగారు పూత విషయంలో అవినీతి జరిగిందన్నారు పిటిషనర్ తరఫు లాయర్. విగ్రహాలకు రసాయనం కలిసిన రంగులు వేశారని.. అధికారులు ఉల్లంఘనలకు పాల్పడ్డారని వాదనలు వినిపించారు. విమాన గోపురానికి బంగారుపూత పూసిన రాగి రేకులు అమర్చడం వల్ల గోపురం దెబ్బతింటుంది అన్నారు. ఇది ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధమని.. ఇందులో అక్రమాలు జరిగాయి అన్నారు. రాగి రేకులకు బంగారు పూతకు బదులు బంగారు రంగు వేస్తున్నారని.. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు అడ్వొకేట్ కమిషన్ను నియమించాలని కోరారు.
అంతేకాదు గోవిందరాజస్వామి దేవాలయం విమాన గోపురంపై ఉన్న దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బాలాలయంలో ఉన్న విగ్రహాలను మహాసంప్రోక్షణ నిర్వహించి తిరిగి ఆలయంలోకి చేరిస్తే.. ఆ ఉల్లంఘనలను పరిశీలించడం సాధ్యం కాదన్నారు. అందుకేమహా సంప్రోక్షణను నిలిపివేయాలని కోరారు. గోవిందరాజస్వామి ఆలయానికి సంబంధించి.. ఇదే తరహా ఆరోపణలతో రెండు పిటిషన్లు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయన్నారు టీటీడీ, గోవిందరాజ స్వామివారి దేవాలయం డిప్యూటీ ఈవో తరఫు లాయర్. ఈ వ్యవహారంలో దాఖలైన రెండు పిటిషన్లోని అంశాలు, టీటీడీ దాఖలు చేసిన కౌంటర్ను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు న్యాయమూర్తి. ఈ పిటిషన్పై విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.
మరోవైపు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణకు సంబంధించి షెడ్యూల విడుదల చేశారు. మే 21 నుంచి 25 వరకు జరుగనున్నాయి. మే 20న సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు సేనాపతి ఉత్సవం, మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగారు పూత పూసిన రాగి రేకులు అమర్చేందుకు 2021 సెప్టెంబరు 14న పనులు ప్రారంభించారు. విమాన గోపురం పనులు పూర్తి కావడంతో జీర్ణోద్ధరణ, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా మే 20వ తేదీ ఉదయం 7.30 నుండి 9 గంటల వరకు ఆచార్య ఋత్విక్ వరణం నిర్వహిస్తారు.
మే 21న ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపడతారు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు శ్రీవారి కళాకర్షణం, కుంభములు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, పరివార దేవతలు యాగశాలకు వేంచేపు చేస్తారు. మే 22 , 23వ తేదీల్లో ఉదయం 8 నుండి 11 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మే 24న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జలాధివాసం, బింబ స్థాపన, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8.30 గంటల వరకు మహాశాంతి తిరుమంజనం, యాగశాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. మే 25న ఉదయం 4 నుంచి 7.30 గంటల వరకు కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి, ఉదయం 7.45 నుంచి 9.15 గంటల వరకు మిథున లగ్నంలో మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. ఆ తరువాత అక్షతారోహణం, అర్చక బహుమానం అందిస్తారు. ఉదయం 10.30 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు పెద్ద శేష వాహనంపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
- Read Latest Andhra Pradesh News and Telugu News