somesh kumar, Bhatti Vikramarka: ‘ఆంధ్రాలో ఉద్యోగం చేయడానికి లేని ఆనందం తెలంగాణలో ఏముంది?’ – bhatti vikramarka fired over the appointment of somesh kumar as the cm kcr advisor
“ధరణి తీసుకొచ్చి జాగీర్దారు, అసైన్డ్ భూములను పార్ట్- బి లో పేర్కొని ప్రభుత్వ పెద్దలు హాంఫర్ట్ చేసే విధంగా సహకరించిన గొప్ప మేధావి సోమేశ్ కుమార్. సబ్బండ వర్గాలు కొట్లాడి కోరి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది పేదల భూములు గుంజుకోవడానికేనా ? కొలువుల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులు గబ్బిలం లాగా పదవులను పట్టుకొని వేలాడటం దేనికి? తెలంగాణ ప్రజలను ఇంకెంతకాలం పీక్కు తింటారు. కొత్త వారికి ఉన్నత పదవుల అవకాశం కల్పించడానికి రిటైర్డ్ అయిన ఉద్యోగులు గౌరవంగా తప్పుకోవాలి.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును ముంబైకి చెందిన ప్రైవేట్ ఏజెన్సీ కంపెనీకి 30 సంవత్సరాలు లీజు ఇవ్వడం వెనుక ప్రభుత్వ పెద్దలకు వెసలుబాటు కల్పించింది మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, స్పెషల్ సెక్రెటరీ అరవింద్ కుమారులే. విదేశీ పెట్టుబడులు తీసుకొస్తామని అమెరికా, దుబాయ్ వెళ్లిన కేటీఆర్ అక్కడ బహుళ జాతి కంపెనీలతో వాటాలు మాట్లాడుకుంటున్నారు. మిగులు భూములు, గత ప్రభుత్వాలు పేదలకు పంచిన భూముల జాబితా సేకరించి వాటిని బలవంతంగా వారి నుంచి సేకరించి బహుళ జాతి కంపెనీలకు కట్టబెడుతున్న కేటీఆర్ తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన పేదల భూములను ఎన్ని వేల ఎకరాలు గుంజుకున్నది.. వాటిని ఎవరెవరికి దారాదత్తం చేసింది శ్వేత పత్రం ద్వారా విడుదల చేయాలి. తెలంగాణ ఏర్పడి పదేళ్లు కావొస్తున్న కృష్ణానదిలో నీటి వాటా తేల్చకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం నిద్రపోతుంది. కృష్ణా నదిలో తెలంగాణ వాటా ఎంత ? ఇప్పటివరకు వాడుకున్నది ఎంత ? ఇంకా వాడుకోవాల్సింది ఎంత ? ఈ వివరాలు తేల్చకపోవటం దారుణం. గత ప్రభుత్వాలు డిజైన్ చేసిన ప్రాజెక్టులకు రీ డిజైన్ చేయడం, ఎస్టిమేషన్ పెంచడం, ఆ పనులు కాంట్రాక్టర్లకు అప్పగించటం, అందులో కమిషన్లు పొందటం. వీటిపై ఉన్న శ్రద్ధ నీళ్లిచ్చే దానిపై ఈ పాలకులకు లేకపోవడం శోచనీయం.” అని భట్టి విక్రమార్క మండిపడ్డారు.
కృష్ణానది నీటి వాట తేల్చకపోవడంపై సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణా నదిపై సంగమేశ్వర్ వద్ద ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాలకు నీటి ఎద్దడి ముప్పు పొంచి ఉందని అన్నారు. రోజుకు 11 టీఎంసీల నీళ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకెళ్తే.. తెలంగాణ కృష్ణా తీర ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మన నీళ్లు, మన భూములు కాపాడుకోవడం కోసం మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని భట్టి విక్రమార్క అన్నారు.
- Read More Telangana News And Telugu News