News

Skill Development Corporation Scam,స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రధాన అంశాలివే: సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ – ap cid dg sanjay press meet on skill development corporation and chandrababu remand


స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణానికి సంబంధించి ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్‌ కీలక వివరాలు తెలిపారు. టీడీపీ కోసం సుదీర్ఘ కాలం పని చేసిన ఆడిటర్‌ను.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో నియమించారు. కేబినెట్ ఆమోదం లేకుండా, కేవలం జీవో ద్వారానే కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. కార్పొరేషన్‌ ఏర్పాటులో నిబంధనలు పాటించలేదని, ప్రైవేట్‌ వ్యక్తి గంటా సుబ్బారావుకు మూడు బాధ్యతలు అప్పగించారని ఆయన తెలిపారు. ఈ కేసులో ఇవే కీలకమైన అంశాలని వెల్లడించారు. రూ. 313 కోట్లలో రూ. 241 కోట్లు నేరుగా షెల్‌ కంపెనీకి వెళ్లాయని, ఈ రూ. 241 కోట్లను షెల్‌ కంపెనీ నుంచి వివిధ రూపాల్లో మళ్లించారని సంజయ్ తెలిపారు. రూ. 241 కోట్లు ఎందుకు మళ్లించారంటే సమాధానం లేదని ఆయన చెప్పారు.

ఈ స్కామ్‌పై జర్మనీలోని సీమెన్స్‌ యాజమాన్యం కూడా స్పందించిందని సంజయ్ తెలిపారు. సీమెన్స్‌ ఇండియా ఉద్యోగులు తమకు వాస్తవాలు చెప్పకుండా దాచారని సీమెన్స్‌ తెలిపిందని గుర్తుచేశారు. ‘సీమెన్స్‌ సంస్థ తమకు రూ. 58.8 కోట్లు మాత్రమే అందాయని తెలిపింది. సీమెన్స్‌ సంస్థ సాఫ్ట్‌వేర్‌ కోసం రూ.58.8 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. సాఫ్ట్‌వేర్‌ మనం ఊహించుకోవాలి. అది ఎక్కడా లేదు. 6 చోట్ల కేంద్రాలు పెట్టాలని నిర్ణయించారు. వెంటనే డబ్బు కూడా విడుదల చేశారు. రూ.370 కోట్ల ఒప్పందంలో సాఫ్ట్‌వేర్‌ ఖర్చును మినహాయించినా.. రూ. 311 కోట్లు ఎక్కడికి వెళ్లాయంటే సమాధానం లేదు’ అని సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్‌ తెలిపారు.

‘ఈ డిపార్ట్‌మెంట్ నేరుగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సంప్రదించేలా ప్లాన్‌ చేశారు. జీవోల్లో 13 చోట్ల చంద్రబాబు స్వహస్తాలతో చేసిన సంతకాలు ఉన్నాయి. బడ్జెట్‌ అనుమతి, కౌన్సిల్‌ సమావేశానికి కూడా చంద్రబాబు సంతకం ఉంది. సీమన్స్‌ను తెచ్చి స్కిల్‌ సెంటర్లు పెట్టాలన్నది ఎంవోయూలో లేదు. అగ్రిమెంట్‌ దురుద్దేశపూర్వకంగా చేసుకున్నారు’ అని సంజయ్ తెలిపారు

స్కిల్ కుంభకోణంలో రిమాండ్ తర్వాత కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వాళ్లందరికీ సమాధానం చెప్పదల్చుకున్నామని సంజయ్ పేర్కొన్నారు. డిప్యూటీ సీఈవో అపర్ణ నియామకంలోనూ చంద్రబాబు సంతకం ఉందని, క్యాబినెట్ సమావేశం మినిట్స్‌లో కూడా చంద్రబాబు సంతకం ఉందని ఆయన తెలిపారు. అగ్రిమెంట్‌కు సంబంధించిన జీవోలో 90:10 శాతం అని చెప్పినా.. ఆ అగ్రిమెంట్‌లో 90 శాతం కోసం ప్రస్తావన లేదని.. ఇందులో దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు.

‘జీవోను తుంగలో తొక్కి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని సీమన్స్ కంపెనీనే స్వయంగా చెప్పింది. మేజిస్ట్రేట్ ముందే వాళ్లు స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్విల్ కార్‌ని ఈడీ, సీఐడీ గతంలోనే అరెస్ట్ చేశారు. ఈడీ అరెస్ట్ చేసి, రూ. 32 కోట్లు ఆస్తులను అటాచ్ చేసింది. సీమన్స్ సంస్థ సీఐడీకి మెయిల్ పంపింది. మేము డబ్బు పెట్టలేదని సీమన్స్ మెయిల్‌ ద్వారా తెలిపింది. ఏసీబీ కోర్టు అన్ని ఆధారాలను పరిశీలించాకే రిమాండ్ ఇచ్చారు’ అని సంజయ్ చెప్పుకొచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ పీటీ వారెంట్ వేశామని సంజయ్ తెలిపారు.

Related Articles

Back to top button