News

September 17,సెప్టెంబర్ 17న ఏం జరిగింది..? ఆరోజుకు ఉన్న ప్రాముఖ్యతేంటి..? – what happened on september 17 in telangana


తెలంగాణలో ఎన్నికలకు దగ్గరపడుతున్న కొద్ది రాష్ట్రంలో పొలిటికల్ వాతావరణం హీటెక్కుతోంది. సెప్టెంబర్ 17 ఆ హీట్‌ను మరింత పెంచింది. సెప్టెంబర్ 17 నుంచి రాజకీయ లబ్ధి పొందాలని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. బీజేపీ విమోచన దినోత్సవం అంటుంటే.. కాంగ్రెస్ విలీనం అంటోంది. అధికార బీఆర్ఎస్, ఎంఐఎం జాతీయ సమైక్యత దినోత్సవం అంటున్నాయి. దీంతో ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు సెప్టెంబరు 17 చుట్టూ తిరుగుతున్నాయి. ఇంతకీ సెప్టెంబర్ 17న ఏం జరిగింది? ఆరోజుకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి ? అనేది ఓసారి తెలుసుకుందాం.

మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. అయితే నిజాం పాలనలోని దక్కన్ ప్రాంతం మాత్రం 13 నెలల తర్వాత అంటే సెప్టెంబర్‌ 17న స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. ఆపరేషన్‌ పోలో పేరుతో నాటి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సైనిక చర్య ఫలితంగా నిజాం నవాబు.. భారత సమాఖ్యలో విలీనానికి అంగీకరించారు. తెలంగాణతోపాటు మరాఠ్వాడా, హైదరాబాద్ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు నిజాం నవాబు పాలనలో ఉండేవి. భారతదేశంతో ఈ సంస్థానానికి సంబంధం ఉండేది కాదు. దీంతో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. నిజాం సంస్థానంలో మాత్రం రాలేదు. స్వాతంత్ర్యం సంస్థానాలను దేశంలో విలీనం చేసే ప్రక్రియను కేంద్రం చేపట్టింది. అందుకు నిజాం నవాబు ఒప్పుకోలేదు. తాము ప్రత్యేక సంస్థానంగానే ఉంటామని.. అసరమైతే పాకిస్థాన్‌లో కలుస్తామని అన్నారు. దేశం మధ్యలో ఉన్న సువిశాల ప్రాంతం భారత యూనియన్‌లో చేరకపోతే.. అది దేశ మనుగడకే ముప్పు. దీంతో హైదరాబాద్ సంస్థానంపై సైనిక చర్యకు దిగాలని నాటి హోం మంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ నిర్ణయించారు. అదే సమయంలో నిజాం నవాబు పాకిస్థాన్ సాయం కోసం వర్తమానం పంపారు. ఐక్యరాజ్య సమితిని కూడా ఆశ్రయించాడు.

భారత సైన్యం 1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానం ముట్టడిని నలువైపుల నుంచి ప్రారంభించింది. ముందుగా మహారాష్ట్ర వైపు నుంచి అన్ని గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీనికి నల్ దుర్గ్ అనే సైన్యాధికారి నాయకత్వం వహించారు. సెప్టెంబర్ 14న ఔరంగాబాద్, జాల్నా, నిర్మల్, వరంగల్, సూర్యాపేటను ఆధీనంలోకి తీసుకోని హైదరాబాద్ వైపు వచ్చారు. మద్రాస్ వైపు నుంచి వచ్చిన సైన్యానికి ఎ.ఎ. రుద్ర, తుల్జాపూర్, తల్ముమడి నుంచి బయల్దేరిన సైన్యానికి జనరల్ డిఎస్ బ్రార్ నాయకత్వం వహించారు. కర్ణాటక వైపు నుంచి వచ్చే సైన్యానికి బ్రిగేడియర్ శివదత్త నాయకత్వం వహించారు. హైదరాబాద్‌కు నలుదిశలా భారత సైన్యం ఒక్కో గ్రామాన్ని ఆధీనంలోకి తీసుకుంటుంటే.. ఆయా గ్రామాల్లోని ప్రజలు ఆర్మీకి స్వాగతాలు పలికారు.

భారత సైన్యం ముందు రజాకార్లు, నిజాం సైన్యం ఎదురు నిలవలేకపోయింది. మూడు రోజుల్లోనే దక్కన్ భాగాన్ని పూర్తిగా భారత ఆర్మీ స్వాధీనం చేసుకుంది. సెప్టెంబర్ 16న మధ్యాహ్నం సమయానికి భారత సైన్యం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మోహరించింది. భారత సైనిక చర్యకు భయపడి నిజాం సైన్యం ప్రధానాధికారి ఇద్రూస్ లొంగిపోయాడు. సెప్టెంబర్ 17న సాయంత్రం సుమారు 5 గంటల సమయానికల్లా భారత ఆర్మీ హైదరాబాద్‌ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. ఆ తర్వాత కాసేపటికే నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టు రేడియో ద్వారా ప్రకటించాడు. అలా ఆపరేషన్ పోలో పూర్తయై.. నిజాం నవాబు నుంచి తెలంగాణ స్వాతంత్య్రం పొంది భారత యూనియన్‌లో కలిసింది.

ఇప్పుడదే రోజున రాష్ట్రంలో హైవోల్టేజీ రాజకీయానికి రంగం సిద్ధమవుతోంది. బీజేపీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తుంటే.. అధికార బీఆర్ఎస్ మాత్రం జాతీయ సమైక్యత దినోత్సవం పేరిట కార్యక్రమాలు చేపడుతోంది. ఇక కాంగ్రెస్ విలీన దినోత్సవం అంటుండగా..ఎంఐఎం కూడా జాతీయ సమైక్యత దినోత్సవం పేరిట ఓల్డ్ సిటీలో తిరింగా ర్యాలీకి ఫ్లాన్ చేసింది. ఇలా ఒక్కో పార్టీ ఒక్కోలా సెప్టెంబర్ 17న నిర్వహిస్తున్నాయి. అయితే.. ఏ పార్టీ ఎలా నిర్వహించినా.. ప్రజలు ఎలా స్వీకరిస్తారనేది ఇక్కడ ప్రాధానాంశం.

Related Articles

Back to top button