sarpanch husband murder, Kamareddy: ఎస్పీ ఆఫీస్కు కూతవేటు దూరంలో.. సర్పంచ్ భర్త దారుణ హత్య! – singarayapalli sarpanch husband murdered in kamareddy
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరాయపల్లి గ్రామ సర్పంచ్ మహేశ్వరి భర్త అధికం నర్సాగౌడ్ కామారెడ్డి పట్టణంలో అధికం పేరుతో దేశీ చికెన్ హోటల్ నిర్వహిస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ.. నర్సాగౌడ్ ఎస్పీ కార్యాలయం సమీపంలోని ఖాళీ స్థలంలో విగతజీవిగా పడి ఉన్నాడు. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు.. విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు.
సోమవారం సాయంత్రం నర్సాగౌడ్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడని.. ఉదయం వరకు అతడు ఇంటికి తిరిగి రాలేదని కుటుంబసభ్యులు బోరన విలపించారు. అయితే.. నర్సాగౌడ్ ముఖం, చేతులపై గాయాలుండటంతో ప్రాథమికంగా హత్యగా నిర్ధారించారు. అలాగే హత్య జరిగిన సమీపంలో మద్యం బాటిళ్లను పోలీసులు గుర్తించారు. గత వారం రోజులుగా గ్రామంలో గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. వాటిని దృష్టిలో పెట్టుకుని కావాలనే నర్సాగౌడ్ను హత్య చేసి ఉంటారని స్థానికులు చెబుతున్నారు.
సంఘటన స్థలానికి కామారెడ్డి డీఎస్పీ సురేష్, రూరల్ సీఐ శ్రీనివాస్ గౌడ్ చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. హత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను త్వరలోనే పట్టుకొని నర్సాగౌడ్ హత్యకు గల కారణాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.
- Read More Telangana News And Telugu News