News

robbery at traffic signal, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సెకన్ల గ్యాప్‌లో 40 లక్షలు చోరీ.. దొంగతనం ఇలా కూడా చేస్తారా! – robbers steal rs 40 lakh from biker bag at red fort traffic signal in delhi, cctv video


బస్సుల్లో, రైళ్లలో ప్రయాణికులకు ఏమాత్రం అనుమానం రాకుండా ‘షార్ప్‌’గా దొంగతనాలు చేసే కేటుగాళ్లను ఇంతకుముందు చూసుంటారు. ఈ వీడియో చూస్తే మాత్రం.. దొంగతనాలు ఇంత ఈజీగా చేస్తారా?! అనే అనుమానం కలుగకమానదు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్ సిగ్నల్ పడటంతో ఓ బైకర్ తన వాహనాన్ని నిలిపివేశాడు. రెండు కార్ల మధ్య ఆ వాహనం ఆగి ఉంటుంది. అతడి వీపునకు పెద్ద బ్యాగ్ తగిలించుకొని ఉంటాడు. ఆ బైక్ ఆగి, ఆగడంతోనే ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చి, ఆ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి.. అందులోని డబ్బులను తీసుకొని, ఒకరి నుంచి ఒకరికి పాస్ చేస్తూ అక్కడ నుంచి క్షణాల్లో మాయమవుతారు. ఇంత జరిగినా ఆ వాహనదారుడు గుర్తించలేకపోతాడు. అంత తెలివిగా వారు దొంగతనం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఈ చోరీ ఘటన చోటుచేసుకుంది. మార్చి 1న జరిగిన ఈ చోరీకి సంబంధించిన సీసీటీవీ వీడియో వైరల్ అవుతోంది.

భారీ ట్రాఫిక్‌ మధ్యలో భుజానికి బ్యాగ్‌ తగిలించుకుని ఉండగానే.. అందులో నుంచి 40 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు ముగ్గురు నిందితులు. ఇంటికెళ్లాక బ్యాగ్ ఓపెన్ చేస్తే గానీ దొంగతనం జరిగిన విషయం గుర్తించలేకపోయాడు బాధితుడు. చేసేదేంలేక పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు అతడు ప్రయాణించిన మార్గంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తించారు.

ఆ వ్యక్తి తన బ్యాగులో పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుకుని బైక్‌పై రావడాన్ని నిందితులు ముందే గమనించారు. దీంతో అతడిని అనుసరిస్తూ అతడి వెనకే వచ్చారు. మార్గమధ్యంలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర బైక్‌ ఆగగానే.. తెలివిగా చోరీకి పాల్పడి అక్కడ నుంచి జారుకున్నారు.

వాహనదారుడు ఆ బ్యాగ్‌‌ను తన భుజానికే తగిలించుకొని ఉన్నా చోరీని గమనించకపోయాడు. అంతేకాదు, పక్కనే ఆగి ఉన్న కార్లలోని వారు గానీ.. ఆ బైక్‌ ముందు నుంచే నడుచుకుంటూ వెళ్లిన పాదచారులు గానీ.. ఎవరూ ఆ దొంగతనాన్ని గుర్తించలేకపోయారు. దొంగలు ఏ రేంజ్‌లో తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.

సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ముగ్గురు నిందితులను గుర్తించిన పోలీసులు.. వారిలో ఇద్దరు నిందితులు ఆకాష్, అభిషేక్‌ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 38 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మూడో నిందితుడి కోసం గాలిస్తున్నారు. వాళ్లు కొంతకాలంగా బైకర్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద కాపు కాచి, పెద్ద మొత్తంలో డబ్బు విత్‌డ్రా చేసుకొని, ఒంటరిగా వెళ్లే వాళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. జరభద్రం!

నాగర్‌కర్నూల్: బిజినేపల్లి ఆలయంలో మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్
తల్లిదండ్రులను వేడుకుంటున్నా.. ర్యాంకుల వల్ల ప్రయోజనం లేదు: లోక్‌సత్తా JP

Related Articles

Back to top button