robbery at traffic signal, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సెకన్ల గ్యాప్లో 40 లక్షలు చోరీ.. దొంగతనం ఇలా కూడా చేస్తారా! – robbers steal rs 40 lakh from biker bag at red fort traffic signal in delhi, cctv video
భారీ ట్రాఫిక్ మధ్యలో భుజానికి బ్యాగ్ తగిలించుకుని ఉండగానే.. అందులో నుంచి 40 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు ముగ్గురు నిందితులు. ఇంటికెళ్లాక బ్యాగ్ ఓపెన్ చేస్తే గానీ దొంగతనం జరిగిన విషయం గుర్తించలేకపోయాడు బాధితుడు. చేసేదేంలేక పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు అతడు ప్రయాణించిన మార్గంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తించారు.
ఆ వ్యక్తి తన బ్యాగులో పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుకుని బైక్పై రావడాన్ని నిందితులు ముందే గమనించారు. దీంతో అతడిని అనుసరిస్తూ అతడి వెనకే వచ్చారు. మార్గమధ్యంలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బైక్ ఆగగానే.. తెలివిగా చోరీకి పాల్పడి అక్కడ నుంచి జారుకున్నారు.
వాహనదారుడు ఆ బ్యాగ్ను తన భుజానికే తగిలించుకొని ఉన్నా చోరీని గమనించకపోయాడు. అంతేకాదు, పక్కనే ఆగి ఉన్న కార్లలోని వారు గానీ.. ఆ బైక్ ముందు నుంచే నడుచుకుంటూ వెళ్లిన పాదచారులు గానీ.. ఎవరూ ఆ దొంగతనాన్ని గుర్తించలేకపోయారు. దొంగలు ఏ రేంజ్లో తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.
సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ముగ్గురు నిందితులను గుర్తించిన పోలీసులు.. వారిలో ఇద్దరు నిందితులు ఆకాష్, అభిషేక్ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 38 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మూడో నిందితుడి కోసం గాలిస్తున్నారు. వాళ్లు కొంతకాలంగా బైకర్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద కాపు కాచి, పెద్ద మొత్తంలో డబ్బు విత్డ్రా చేసుకొని, ఒంటరిగా వెళ్లే వాళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. జరభద్రం!