News

renuka chowdhury, వైఎస్సార్ ఆత్మకు శాంతి లేకుండా.. సీఎం జగన్ పిచ్చివేషాలు: రేణుకా చౌదరి – congress leader renuka chowdhury serious comments against cm ys jagan mohan reddy


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గొప్ప పరిపాలన చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తన సంతానం మూలంగా సుఖం లేకుండా పోయిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బుధవారం విజయవాడలో రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆత్మకు శాంతి లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిచ్చివేషాలు వేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పిచ్చి వేషాలు వేసే వారని ఆరోపించారు. అయితే జగన్ విషయాలను తండ్రిగా వైఎస్సార్ బయటకు రాకుండా కాపాడినట్లు తెలిపారు.

ఏపీలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని రేణుకా చౌదరి మండిపడ్డారు. రౌడీయిజం చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి చూస్తే జాలిపడాలా, కోపం తెచ్చుకోవాలా, అక్రోషం తెచ్చుకోవాలో అర్థం కావట్లేదన్నారు. బంగారం లాంటి రాష్ట్రం పతనమైపోతోందన్నారు. అమరావతి రైతులు మూడు సంవత్సరాలుగా ఆందోళన చేస్తుంటే.. సీఎం జగన్ పట్టించుకోకపోవటం దారుణమన్నారు.

ఇక, నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) కూడా రాజశేఖర్‌ రెడ్డిని గౌరవించేవారని… వారిద్దరికీ ఒకరిపై ఒకరికి గౌరవం ఉండేదని రేణుకా చౌదరి తెలిపారు. వారికి ఆత్మశాంతి లేకుండా సీఎం జగన్.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పేరు పెడితే ఏమీ పెరుగుతారని. వైఎస్సార్ పేరు పెట్టకపోతే తగ్గిపోతారని అనుకుంటే పోరపాటే అని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ రాష్ట్రానికి ముందుగా ఓ యూనివర్సిటీని తీసుకొచ్చి.. అప్పుడు దానికి నీపేరో, తాత పేరో పెట్టుకో అని హితవుపిలికారు.

ఇక, అమరావతి రైతులకు ఎంత అడ్డం పడితే వారి ఉద్యమం అంతగా బలపడుతుందని రేణుకా చౌదరి అన్నారు. ఈ ఉద్యమం ద్వారా రైతు గౌరవాన్ని పెంచారని.. రైతులకు కులం లేదన్నారు. రాజధాని రైతులు పిలిస్తే.. ఏ క్షణమైనా తాను వస్తానని స్పష్టం చేశారు.

రాజధాని విషయంలో సుప్రీం కోర్టు తీర్పులను కూడా సీఎం జగన్ లెక్కచేయడం లేదని రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సుప్రీం కోర్టు ఎందుకు సుమోటోగా యాక్షన్ తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నిజానికి తాడు గుడివాడ వెళ్లాల్సి ఉందని.. త్వరలో వస్తానని వెల్లడించారు. ఇది జస్ట్ ట్రయిల్ రన్ మాత్రమే అని రేణుక చౌదరి అన్నారు. మరోవైపు ఏపీలో పోటీపై రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి అయినా పోటీ చేస్తానని ప్రకటించారు.

Related Articles

Back to top button