News

Rbi,Loan Documents: అలా చేస్తే రోజుకు రూ.5000 ఫైన్.. బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశం! – rbi orders banks to pay rs 5000 fine per day for failed to release property docs within 30 days


Loan Documents: డబ్బులు అవసరమైనప్పుడు బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల వద్ద మార్టగేజ్ లోన్స్ తీసుకుంటారు. అంటే ఇల్లు, ప్రాపర్టీల డాక్యుమెంట్లను బ్యాంకుల వద్ద తనఖా పెట్టి రుణాలు తీసుకుంటారు. లోన్ తీసుకున్న వారు సక్రమంగా చెల్లించని పక్షంలో బ్యాంకులు వాటిని విక్రయించి రికవరీ చేస్తాయి. తమకు రావాల్సిన డబ్బుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాయి. అయితే, కొన్ని సార్లు లోన్లు సరైన సమయంలో చెల్లించినా రుణాలు పొందిన వారిని తమ చుట్టూ తిప్పించుకుంటాయి. ఇలాంటి సంఘటనలు పెరిగిపోతున్న క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు గట్టి ఝలక్ ఇచ్చింది.

ప్రాపర్టీ లోన్ల విషయంలో వినియోగదారులకు అనుకూలంగా రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. లోన్ చెల్లించిన 30 రోజుల్లోగా బ్యాంకులు తమ వద్ద ఉన్న ప్రాపర్టీ ఒరిజినల్ డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు లోన్ చెల్లింపులు పూర్తయ్యాక ఆస్తి పత్రాలను సకాలంలో తిరిగి అందించకుంటే కస్టమర్లకు నష్ట పరిహారం చెల్లించాలాని స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో పాటు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, రూరల్ బ్యాంకులు, సహకార బ్యాంకులు సైతం ఆదేశాలు ఇచ్చింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోడ్ ఆఫ్ ఫెయిర్ ప్రాక్టీస్ ప్రకారం.. కస్టమర్ ప్రాపర్టీ లోన్ వాయిదాలు పూర్తి చెల్లింపులు చేసిన తర్వాత వెంటనే ఆస్తి పత్రాలను బ్యాంకులు ఇచ్చేయాలి. ఇకపై రుణ సంస్థలు లోన్ సెటిల్మెంట్ తర్వాత 30 రోజుల్లోగా కస్టమర్లకు ఒరిజినల్ డాక్యుమెంట్లను తిరిగి అందించాలి. కస్టమర్లు తమ బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి వాటిని తీసుకోవాలి. అలాగే లోన్ మంజూరు సమయంలోనే బ్యాంకులు ఇచ్చే లేఖలో డాక్యుమెంట్ పత్రాలను ఎప్పుడు తిరిగి అందిస్తారనే తేదీ, డాక్యుమెంట్లు ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి అనేది సూచించాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఒక వేల లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే చట్టపరమైన వారసులకు వాటిని తిరిగి ఇచ్చే విధానాన్ని నిర్ణయించాలని తెలిపింది.

ప్రాపర్టీ లోన్ పూర్తిగా చెల్లించిన 30 రోజుల్లోపు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వడంలో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు విఫలమైతే కస్టమర్లకు రోజుకు రూ. 5000 చొప్పున పరిహారం చెల్లించాలని బ్యాంకులను ఆదేశించింది. 30 రోజుల తర్వాత ఎన్ని రోజులు జాప్యం చేస్తే అన్ని రోజుల పాటు రోజు రూ.5 వేలు జరిమానా చెల్లించాల్సిందేనని చెప్పింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 21, 35ఏ, 56, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934లోని సెక్షన్ 45జేఏ, 45ఎల్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ యాక్ట్ 1987లోని సెక్షన్ 30ఏ ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసింది.

  • Read Latest Business News and Telugu News

Loan Recovery: లోన్ రికవరీ ఏజెంట్లు వేధింపులకు ఇలా చెక్ పెట్టండి! Bank Account: అదే జరిగితే మీ బ్యాంక్ ఖాతా బ్లాక్.. మళ్లీ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? MCLR: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షాక్.. కస్టమర్లు ఇక ఎక్కువ కట్టాల్సిందే.. నేటి నుంచే నిర్ణయం అమల్లోకి..

Related Articles

Back to top button