Pm Modi On Andhra Pradesh Bifuraction,తెలంగాణ ఏర్పాటు సరిగా జరగలేదు.. ఏపీ విభజనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు – pm modi dig at congress by bring up telangana creation in his last speech in old parliament building
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈ భవనంలోనే జరిగిందన్న మోదీ.. విభజించిన తీరు మాత్రం పాత రాష్ట్రమైన ఏపీని, కొత్త రాష్ట్రమైన తెలంగాణను సంతృప్తి పర్చలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు కాకుండా ఎన్నో ప్రయత్నాలు జరిగాయన్న ప్రధాని.. ఎంతో మంది రక్తం చిందించారన్నారు. కానీ రాష్ట్రం ఏర్పాటయ్యాక.. ఇటు తెలంగాణ గానీ.. అటు ఆంధ్రప్రదేశ్ గానీ సంబరాలు చేసుకోలేకపోయాయన్నారు. కానీ వాజ్పేయి హయాంలో మూడు రాష్ట్రాలు కొత్తగా ఏర్పాటు కాగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదన్నారు.
‘ఉత్తరాఖండ్ ఏర్పాటు సమయంలో దాని మాతృ రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ సంబరాలు చేసుకుంది. అలాగే ఛత్తీస్గఢ్ ఏర్పాటు సమయంలో మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఏర్పాటు సమయంలో బిహార్ కూడా సంబరాలు చేసుకున్నాయి’ అని ప్రధాని మోదీ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభలో సోనియా గాంధీ వ్యాఖ్యానించిన మరుసటి రోజే ప్రధాని మోదీ.. తెలంగాణ ఏర్పాటైన తీరు సరిగా లేదని వ్యాఖ్యానించడం గమనార్హం.
ప్రధాని మోదీ పైన పేర్కొన్న మూడు కొత్త రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ ఏర్పాటు భిన్నమైంది. కొత్తగా ఏర్పాటైన ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు నూతనంగా రాజధానిని నిర్మించుకున్నాయి. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన విషయానికి వస్తే రాజధాని కొత్తగా ఏర్పాటై తెలంగాణలో ఉండిపోగా.. పాత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నూతనంగా రాజధానిని నిర్మించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతోపాటు లోటు బడ్జెట్తో ఏపీ సతమతమైంది. ఈ సమస్యలకు కేంద్రం సరైన పరిష్కారం చూపలేకపోవడంతో.. విభజనతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చాలా నష్టపోయింది. మరోవైపు తెలంగాణను సైతం విభజన సమస్యలు వెంటాడుతున్నాయి.
ఏదేమైనా పార్లమెంట్ పాత భవనంలో తన చివరి ప్రసంగంలో ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటైన తీరు గురించి ప్రస్తావించడం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. రాజకీయాల నుంచి వైదొలిగి విశ్రాంతి తీసుకోవాలనుకున్న పీవీ నరసింహారావు అనూహ్యంగా ప్రధాని పగ్గాలు చేపట్టి.. దేశానికి దిశానిర్దేశం చేయడాన్ని కూడా మోదీ గుర్తు చేసుకున్నారు. పాత పార్లమెంట్ భవనంలో పని చేసిన ప్రధానుల గురించి ప్రస్తావించిన మోదీ.. వారు చేసిన సేవలను కొనియాడారు.