Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కొనసాగుతోంది. దాదాపు గంటకుపైగా వీరి సమావేశం కొనసాగుతోంది. నేరుగా జూబ్లీహిల్స్లోని చంద్రబాబు ఇంటికి వెళ్లిన పవన్కు చంద్రబాబు స్వాగతం పలికారు చంద్రబాబుకు పవన్ పుష్పగుచ్చం అందించగా.. పవన్ను చంద్రబాబు సన్మానించారు. అనంతరం ఏకాంతంగా చంద్రబాబు, పవన్లు సమావేశమయ్యారు. పవన్ కల్యాణ్ వెంట జనసేన నేతలు కూడా ఎవరూ లేరు. దీంతో ఈ సమావేశం ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారింది. చంద్రబాబు, పవన్ ఏం చర్చించుకుంటున్నారనే చర్చ జరుగుతోంది.
ఈ సమావేశం అనంతరం చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. ఉమ్మడి మీడియా సమావేశంలో చంద్రబాబు, పవన్ కీలక ప్రకటనలు చేసే అవకాశముంది. జీవో 1పై ఉమ్మడి పోరాటం, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక బలోపేతానికి ఐక్యా కారాచరణ ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. జీవో 1పై వివాదం, ఏపీలో ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో చంద్రబాబు, పవన్ భేటీపై ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పొత్తుపై ఇప్పుడే ప్రకటించాలా? లేదా కొంతమంది వేచి ఉండాలా? అనే విషయంపై పవన్, చంద్రబాబు చర్చించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కలిసి ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించుకుంటున్నట్లు చెబుతున్నారు.
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రతిపక్ష సభలపై ఆంక్షలు, ప్రతిపక్ష నేతలపై కేసులు, దాడుల గురించి చర్చించుకుంటున్నట్లు వార్తలు వస్తోన్నాయి. తాజా రాజకీయ అంశాలపై చంద్రబాబు, పవన్ చర్చించుకున్నట్లు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో కూడా చంద్రబాబు, పవన్లు పలుమార్లు భేటీ అయిన తర్వాత పొత్తుపై ప్రకటించారు. 2014లాంటి పరిణామాలే ఇప్పుడు కూడా చోటుచేసుకుంటుండటంతో.. పవన్, చంద్రబాబు తాజా భేటీతో ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులు చోటుచేసుకునే అవకాశముందని చెబుతున్నారు.