nimmala ramanaidu, ఏపీలో కనిపించని రూ. 2 వేల నోట్లన్నీ తాడేపల్లి ప్యాలెస్లోనే: టీడీపీ తీవ్ర ఆరోపణలు – tdp leaders allegations against cm ys jagan mohan reddy
రాష్ట్రంలో చెలామణిలో ఉన్న మెజారిటీ రూ. 2 వేల నోట్లు తాడేపల్లి ప్యాలెస్లోనే ఉందని కాలవ శ్రీనివాసులు అన్నారు. ఇడుపులపాయలోని నేలమాళిగల్లో రూ. 2 వేల నోట్ల కట్టలు ఉన్నట్లు సమాచారం వస్తోందన్నారు. ఎన్నికల్లో ఈ డబ్బులను వెదజల్లి లబ్ధి పొందాలని జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నారని మండిపడ్డారు. గడువులోగా ఏ బ్యాంకులో అయినా పెద్ద ఎత్తున జరిగే నగదు మార్పిడిపై నిఘా పెట్టాలని అధికారులకు కాలవ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.
తాడేపల్లి ప్యాలెస్లో వణుకు..
ఇక, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనిపించని రూ. 2 వేల నోట్లన్నీ తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నాయని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మల రామానాయుడు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఈ డబ్బుతోనే గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో రూ. 2 వేల నోట్లు దాచారన్నారు. మద్యం, ఇసుక, మైనింగ్, అక్రమ భూ లావాదేవీలతో లక్షల కోట్ల రూపాయలు సీఎం జగన్ సంపాదించారని నిమ్మల ఆరోపించారు.
తాడేపల్లి ప్యాలెస్, ఇడుపులపాయ ఎస్టేట్, లోటస్ పాండ్, బెంగళూరు ఎలహంకా నివాసాలపై అధికారులు ప్రత్యేక నిఘా ఉంచాలని నిమ్మల రామానాయుడు కోరారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీలో జరిగే రూ. 2,000 నోట్ల మార్పిడిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. సెప్టెంబర్ 30వ తేదీ లోపు సీఎం జగన్, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు వివిధ మార్గాల గుండా రూ. 2 వేల నోట్ల మార్పిడికి సిద్ధపడ్డారన్న సమాచారం తమకు ఉందన్నారు. ఆర్బీఐ నిర్ణయంతో తాడేపల్లి ప్యాలెస్లో వణుకు మొదలైందని ఆరోపించారు.