Nawaz Sharif,Pakistan: భారత్ చంద్రుడి మీదికి వెళ్తే.. పాకిస్థాన్ అడుక్కుంటోంది: పాక్ మాజీ ప్రధాని – india reached moon pakistan begging from world says ex pm nawaz sharif
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తాజాగా భారతదేశంపై ప్రశంసలు కురిపిస్తూ, తమ దేశంపై విమర్శలు గుప్పించారు. భారతదేశం చంద్రునిపైకి చేరుకోవడంతో పాటు ప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సమావేశాలకు ఆతిథ్యమిస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం ప్రపంచం ముందు
అడుక్కుతింటోందని సోమవారం సాయంత్రం లాహోర్లో జరిగిన వర్చువల్ మీటింగ్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ ఆర్మీ జనరల్స్, జడ్జీలు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేయడం వల్లే.. పాకిస్థాన్కు ఈ దుస్థితి పట్టిందని మండిపడ్డారు. గత కొన్ని ఏళ్ల నుంచి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఏటా పతనమవుతూ వస్తోందని.. ఇప్పుడు రెండంకెల ద్రవ్యోల్బణం రూపంలో పేద ప్రజలపై తీవ్ర ఒత్తిడిని తీసుకువస్తోందని నవాజ్ షరీఫ్ అభిప్రాయపడ్డారు.
నిధుల కోసం పాకిస్తాన్ ప్రపంచ దేశాలను పట్టుకొని వేడుకుంటోందని.. ఎందుకు భారత్ లాగా పాకిస్తాన్ ఘనతల్ని సాధించలేదని నవాజ్ షరీఫ్ ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితికి బాధ్యులు ఎవరు అని నిలదీశారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నపుడు భారత్ ఖాతాలో కేవలం ఒక బిలియన్ డాలర్లు మాత్రమే ఉండేవని చెప్పారు. కానీ.. ప్రస్తుతం భారత్ వద్ద 600 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయని తెలిపారు. భారత్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే పాకిస్తాన్ మాత్రం నిధుల కోసం ప్రపంచం మొత్తం అడుక్కుంటూ తిరుగుతోందని పేర్కొన్నారు.
ప్రస్తుతం పాక్లో ఆర్థిక, రాజకీయ సంక్షోభం తీవ్రంగా ఉంది. గతంలో పాక్ ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్ పేరు పనామా పేపర్స్ లీక్లో బయటపడటంతో పాక్ సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసింది. దీంతో ప్రధాని పదవి దిగాల్సి వచ్చింది. ఆ తర్వాత 2019 లో అల్ అజీజియా అవినీతి కేసులో లాహోర్ కోర్టు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. ఆ సమయంలో అనారోగ్యానికి గురైన నవాజ్ షరీఫ్.. చికిత్స కోసం లండన్కు వెళ్లారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్న నవాజ్ షరీఫ్.. పాక్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు అక్టోబర్ 21న స్వదేశానికి తిరిగి రానున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తన పార్టీ గెలుస్తుందని నవాజ్ షరీఫ్ ధీమా వ్యక్తం చేశారు. ఆయనను స్వాగతించేందుకు నవాజ్ పార్టీ కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
Read More Latest International News And Telugu News