మధ్యప్రదేశ్కు (Madhya Pradesh) చెందిన బీజేపీ ఎంపీ ఊహించని పని చేసి… మళ్లీ వార్తల్లో నిలిచారు. నెటిజన్ల మన్ననలను పొందారు. రేవాకు చెందిన బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా (Janardan Mishra) తరచూ భిన్నమైన పనులు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. తాజాగా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం.. ఓ టాయిలెట్ను ఆయన క్లీన్ చేశారు. అందులో తన ఒట్టి చేతులతో మురికిగా ఉన్న టాయిలెట్ను శుభ్రం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
బీజేపీ యువమోర్చా ఆధ్వ్యంలో రేవా జిల్లా ఖత్ఖారీదిలో జనార్దన్ మిశ్రా చెట్ల పెంపకం కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారు. అది బాలికల పాఠశాల. అయితే చెట్లు నాటిన తర్వాత ఆ స్కూల్లో మరుగుదొడ్డి అపరిశుభ్రంగా ఉండడంతో.. ఆయనే దానిని శుభ్రం చేసేందుకు రంగంలోకి దిగారు. అందులో ఒట్టి చేతులతో రుద్దుతూ దానిని క్లీన్ చేశారు. పైగా దీనికి సంబంధించిన వీడియోను ఎంపీ మిశ్రా తన ట్విట్టర్ హ్యాండిల్లో స్వయంగా షేర్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎంపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులను ట్యాగ్ చేశారు.
అయితే ప్రధాని మోదీ చేపట్టిన ఈ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎంపీ మిశ్రా పాఠశాలలో టాయిలెట్ను శుభ్రం చేయడం ఇదే తొలిసారి కాదు. ఫిబ్రవరి 2018 లో అతను తన నియోజకవర్గంలోని ప్రాథమిక పాఠశాల టాయిలెట్ను శుభ్రం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతకుముందు ఆయన తన నియోజకవర్గమైన రేవా వీధులను ఆయన శుభ్రం చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. అయితే ఎంపీ జనార్దన్ మిశ్రా ఇలాంటి ఘటనలతోనే కాదు.. వెరైటీగా మాట్లాడుతూ అందరిని దృష్టిని ఆకర్షించగలరు.