News

Mohammed Siraj,సిరాజ్ మంచి మనసు.. రూ.4 లక్షల ప్రైజ్ మనీ వాళ్లకు ఇచ్చేశాడు – mohammed siraj wins hearts donate potm cash prize to sri lankan ground staff


సంచలన ప్రదర్శనతో ఆసియా కప్ 2023 ఫైనల్ హీరోగా నిలిచిన హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్.. మంచి మనసు చాటుకున్నాడు. ఈ మ్యాచులో 6 వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించిన సిరాజ్.. ప్లేయర్ అఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ప్రైజ్‌మనీగా 5 వేల అమెరికన్ డాలర్లు అంటే.. మన కరెన్సీలో సుమారు రూ.4 లక్షలు గెలుచుకున్నాడు. అయితే తన బౌలింగ్ ప్రదర్శన గురించి మాట్లాడుతూనే సిరాజ్.. తన మనసులోని మాటను బయటపెట్టాడు. ప్రైజ్ మనీగా తనకు దక్కిన రూ.4 లక్షలను స్టేడియం సిబ్బందికి ఇస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో అక్కడే ఉన్న సహచర ఆటగాళ్లు, మైదానంలోని ప్రేక్షకుల చప్పట్లతో స్టేడియం మార్మోగిపోయింది.

అనంతరం మాట్లాడిన సిరాజ్.. గ్రౌండ్ మెన్ లేకపోతే అసల ఆసియా కప్ సాధ్యమయ్యేది కాదు. వాళ్ల కష్టానికి గుర్తింపుగా నా వంతుగా ఈ పని చేస్తున్నా అని వ్యాఖ్యానించాడు.

ఇక ఈ మ్యాచులో సిరాజ్ తనలోని మరో కోణాన్ని చూపించాడు. తన బంతులతో శ్రీలంక బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. ఒకే ఓవర్‌లో 4 వికెట్లు తీసి సత్తాచాటాడు. మొత్తంగా 7 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి.. 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆసియాకప్ ఫైనల్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక కేవలం 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 6.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా మ్యాచును ముగించింది. దీంతో 8వసారి భారత్ ఆసియాకప్ టైటిల్‍ను దక్కించుకుంది. అత్యధికంగా 8 సార్లు ట్రోఫీ గెలుచుకున్న జట్టుగా అవతరించింది.

ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కూడా గ్రౌండ్స్ మెన్‌కు ప్రోత్సాహకం ప్రకటించింది. ఈ మేరకు స్టేడియం స్టాఫ్‌కు 50వేల అమెరికన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.42లక్షలను అందించింది. ఇందుకు సంబంధించిన చెక్కును ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్, బీసీసీఐ కార్యదర్శి జైషా అందించారు.

ఆసియాకప్ 2023 టోర్నీలో చాలా మ్యాచ్‍లకు వర్షం అంతరాయం కలిగించింది. ముఖ్యంగా సూపర్-4లో నైతే.. దాదాపు ప్రతీ మ్యాచులో వర్షం ఎంట్రీ ఇచ్చింది. దీంతో కవర్లు తీసుకురావడం, మళ్లీ తొలగించడం, మైదానాన్ని సిద్దం చేయడం.. మ్యాచు జరుగుతున్నంత సేపు సిబ్బందికి ఇదే పనిగా తయారైంది. వారి కృషితోనే మ్యాచులు సజావుగా సాగాయి. టోర్నీ విజయవంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలో వారి కృషికి ఫలితంగా సిరాజ్ రూ.4 లక్షలు అందజేశాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ కూడా రూ.42 లక్షలు అందించింది. దీంతో మొత్తంగా మైదానం సిబ్బందికి రూ.46 లక్షలు అందాయి.

Related Articles

Back to top button