Mitchell Marsh Prediction,కప్పు మాదే, భారత్ను 385 పరుగుల తేడాతో ఓడిస్తాం.. మిచెల్ మార్ష్ 6 నెలల కిందటి పోస్టు వైరల్ – australia mitchell marsh old prediction goes viral ahead of world cup 2023 final match
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్.. మిచెల్ మార్ష్ చేసిన వ్యాఖ్య ఒకటి నెట్టింట వైరల్గా మారింది. అసలేం జరిగిందంటే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో మిచెల్ మార్ష్.. దిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడాడు. అయితే మెగా టోర్నీకి సుమారు 6 నెలల ముందే వరల్డ్ కప్ ఫైనల్ చేరే జట్లు ఏవి? అనే ప్రశ్న మార్ష్కు ఎదురైంది. దీనిపై ఏమాత్రం బెరుకు లేకుండా ఆస్ట్రేలియా – భారత్ జట్లు ఫైనల్ చేరతాయని జోస్యం చెప్పాడు. సరిగ్గా ఇప్పుడు అదే నిజమైంది.
మార్ష్ ఫైనల్ చేరే జట్లేవో మాత్రమే చెప్పలేదు.. ఏ జట్టు ఎంత స్కోరు చేస్తుంది.. ఎవరు గెలుస్తారు.. ఎన్ని పరుగులతో గెలుస్తారు అనే విషయాన్ని సైతం చెప్పుకొచ్చాడు. ఫైనల్ మ్యాచులో తొలుత ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుంది. 50 ఓవర్లలో 450/2 పరుగులు చేస్తుందని పేర్కొన్నాడు. అంతేకాకుండా భారత్.. 65 పరుగులకే ఆలౌట్ అవుతుందని.. దీంతో 385 పరుగుల తేడాతో గెలిచి.. మెగా టోర్నీని ఆస్ట్రేలియా ఆరోసారి అందుకుంటుందని వెల్లడించాడు.
ఈ టోర్నీలో ఆస్ట్రేలియా ఓటమి అన్నదే ఎరగకుండా కప్పు సొంతం చేసుకుంటుందని వివరించాడు. మార్ష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఫైనల్కు చేరే జట్లేవో చెప్పడం వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత మార్ష్ జోస్యం నిజమయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఆస్ట్రేలియా ఒక్క మ్యాచు కూడ ఓడకుండా కప్పు సొంతం చేసుకుంటుందని మార్ష్ చెప్పాడు. కానీ తొలి రెండు మ్యాచుల్లో ఆసీస్ ఓటమి పాలైంది. ఇక ఫైనల్లో 450 రన్స్ చేస్తామని పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత బౌలర్ల ఫామ్ చూస్తే.. ఆసీస్ ఆ స్థాయిలో స్కోరు చేయడం కష్టమే. ఇక టీమిండియాను 65 పరుగులకే ఆలౌట్ చేస్తామనడం అసాధ్యమే! ఫైనల్లో టీమిండియా గెలిచాక.. నెటిజన్లు మార్ష్ను ట్రోల్స్ చేయడం పక్కా.