News

manish sisodia, మంత్రి పదవులకు సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామా.. ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం – delhi ministers manish sisodia and satyendar jain resigned


ఢిల్లీ రాజకీయాల్లో క్షణక్షణం కీలక పరిణామలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, అంతకుముందు మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌లు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వీరిద్దరి రాజీనామాలను ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌ ఆమోదించారు.

అయితే, మనీష్ సిసోడియా రాజీనామాలు పరిపాలనా చర్యల్లోనే భాగం తప్ప.. ఏ విధంగానూ నేరాన్ని అంగీకరించినట్లు కాదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) స్పష్టం చేసింది. అయితే, మరో ఇద్దరు మంత్రులకు వీరి శాఖలను అప్పగిస్తారని.. కొత్త మంత్రులుగా కేబినెట్‌లోకి ఎవరినీ తీసుకొనే అవకాశం లేదని ఆప్‌ వర్గాలు చెబుతున్నాయి. కాగా, అరెస్టయిన నేతలను ఇంకా కేబినెట్‌లో కొనసాగిస్తుండటంపై బీజేపీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక మంత్రులుగా ఉన్న ఇద్దరు నేతలు రాజీనామా చేయడం ఢిల్లీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఇక, తనపై వచ్చిన ఆరోపణలు తప్పని రుజువయ్యేంత వరకు మంత్రి పదవికి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు మనీష్ సిసోడియా తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు మూడు పేజీల లేఖను సీఎం కేజ్రీవాల్‌కు పంపారు. మరికొన్ని కేసులు సైతం తనపై పెట్టి ఉండొచ్చని.. అయితే, ఆ ఆరోపణలన్నీ అవాస్తవమేనన్నారు. మరోవైపు సత్యేంద్ర జైన్ దాదాపు 9 నెలలుగా జైలులో ఉండటంతో ఆయన నిర్వహించిన ఆరోగ్య శాఖతో పాటు మొత్తం 18 మంత్రిత్వ శాఖలకు మనీష్ సిసోడియానే ఇన్‌ఛార్జిగా ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీ కేబినెట్‌లో సీఎం కేజ్రీవాల్‌తో పాటు ఐదుగురు మంత్రులు మాత్రమే ఉన్నారు. ఇటు పార్టీలోను, అటు ప్రభుత్వంలో కూడా కేజ్రీవాల్‌ తర్వాత నంబర్‌-2గా సిసోడియానే ఉన్నారు. సత్యేందర్‌ జైన్‌ అరెస్టు తర్వాత ఆయన శాఖలను సైతం సిసోడియానే నిర్వహిస్తూ వచ్చారు.

కేజ్రీవాల్‌ ఆప్‌ జాతీయ ప్రణాళికలు చూసే బాధ్యతల్లో నిమగ్నం కావడంతో సిసోడియానే ఎక్కువ శాఖలు చూస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో సిసోడియా నిర్వహించిన శాఖల బాధ్యతల్ని కైలాశ్‌ గహ్లోత్‌; సత్యేందర్‌ జైన్‌ శాఖల్ని రాజ్‌కుమార్‌ ఆనంద్‌ చూడనున్నట్లు తెలుస్తోంది.

Related Articles

Back to top button