komatireddy venkat reddy, నేనొక మిస్డ్ కాల్ ఇస్తే చాలు CM హెలికాప్టర్ ఏసుకొని ఉరుకొస్తడు: కోమటిరెడ్డి – congress mp komatireddy venkat reddy made key comments on cm post
ఇదిలా ఉండగా ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నేతలపై నిత్యం ఏదో రకమైన కామెంట్స్ చేస్తూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా ఉంటారు కోమటిరెడ్డి. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళిత అభ్యర్థిని సీఎం చేయాలంటూ ఆయన ఇటీవల కీలక కామెంట్స్ చేశారు. ప్రస్తుతం టీపీసీసీ రేవంత్, ఉత్తమ్, జానా రెడ్డి వంటి సీనియర్ నేతలు ఆ పదవికి పోటీ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తుండగా.. అలాంటి సమయంలో కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ టీ కాంగ్రెస్లో కాక రేపాయి.
ఇక రెండ్రోజుల క్రితం ( మే 23) కోమటిరెడ్డి తన 60వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. తన స్వగ్రామమైన బ్రహ్మణ వెల్లెంలలో అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కోమటిరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సీఎం.. సీఎం.. అంటూ పదే పదే స్లోగన్స్ ఇచ్చారు. వారి నినాదాలపై స్పందించిన కోమటిరెడ్డి కీలక కామెంట్స్ చేశారు. తనకు సీఎం పదవిపై ఆశ లేదని.. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవిని త్యాగం చేశానని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవి అంటే చిన్న రాష్ట్రంలో సీఎం పదవి కంటే ఎక్కువేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరూ సీఎంగా ఉన్నా.. తాను ఓ మిస్డ్ కాల్ ఇస్తే ఇక్కడకు వస్తారన్నారు.
“ఇగ మీరు సీఎం అంటే ఎమ్మెల్యే కూడా కాలేం మనం. నేను ఫస్టే చెప్పిన సీఎం అనకపోతే సీఎం అయితా. అంటే మాత్రం సీఎం కాలేను. మీరు సీఎం.. సీఎం..అంటే అందరు కలిసి నన్ను ఓడగొడత్తరు. కాంగ్రెస్ సీఎం ఎవరున్నా.. వెంకట్ రెడ్డి సెల్ఫోన్ నుంచి మిస్డ్ కాల్ ఇస్తే చాలు హెలికాప్టర్ ఏస్కొని ఉరుకొస్తడు. మీరు కావాలనుకుంటే సీఎం అయితా. నాకు కోరికలు ఉండవు. మంత్రి పదవినే వదిలిపెట్టిన వాడిని. అంత పెద్ద రాష్ట్రానికి మంత్రంటే.. ఈ చిన్న రాష్ట్రానికి సీఎం పదవి చిన్నదన్నట్లు.” అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ అసెంబ్లీ నియోజవర్గం నుంచి 1999 నుంచి 2014 వరకు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో వైఎస్ మంత్రి వర్గంలో క్రీడలు, సమాచార సాంకేతిక శాఖ మంత్రిగా పని చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆయన.. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి భువనగిరి ఎంపీగా గెలుపొందారు.
- Read More Telangana News And Telugu News