News
Karnataka Cabinet: కొలిక్కివస్తోన్న క్యాబినెట్ కూర్పు.. రేపు ప్రమాణం చేయనున్న మరో 24 మంది!
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండు వారాలు పూర్తయినా.. మంత్రివర్గ విస్తరణ కొలిక్కిరాలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మే 19న క్యాబినెట్ కూర్పుపై కసరత్తు ప్రారంభమైనా.. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం మధ్య విబేధాల కారణంగా ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో మంత్రి పదవుల పంచాయతీ కాంగ్రెస్ హైకమాండ్ వద్దకు చేరింది. క్యాబినెట్లోకి మరో 24 మందిని తీసుకురానున్నారని, శనివారం ప్రమాణస్వీకారం చేస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో మకాం వేసిన సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. కేంద్ర పెద్దలతో సమావేశమైన అనంతరం తుది జాబితాను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య శుక్రవారం భేటీ కానున్నట్టు సమాచారం. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో మే 20 ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్లు ప్రమాణస్వీకారం చేశారు. వీరితో పాటు మరో 8 మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. వీరితో పాటు కనీసం మరో 25 మంది మంత్రులు కావాల్సి ఉంది. సీఎం,, డిప్యూటీ సీఎం ఇద్దరూ తమ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను క్యాబినెట్లో ఎక్కువగా ఉండేలా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తద్వారా నిర్ణయాలు తీసుకోవడం.. ప్రభుత్వాన్ని నడపడంలో తమ మాట చెల్లుతుందనేది వారి భావన.సీఎం, డిప్యూటీ సీఎంలతో ప్రమాణం చేసినవారికి శాఖలను ఇప్పటి వరకూ కేటాయించలేదు. దీనిపై బీజేపీ విమర్శలు గుప్పిస్తుండగా.. గతంలో యడియూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఒక్కరే మంత్రి ఉన్నారనే విషయాన్ని కాంగ్రెస్ గుర్తుచేస్తోంది. సామాజిక సమీకరణాల ఆధారంగా క్యాబినెట్ కూర్పు ఉంటుందని భావిస్తున్నారు. వివిధ వర్గాలను సమతూకం చేసి ప్రాతినిధ్యం వహించాల్సిన అవసరం ఉన్నందున జాబితాను రూపొందించడం, శాఖల కేటాయింపు కాంగ్రెస్కు కత్తిమీద సామే.రాష్ట్రంలో రాజకీయంగా అత్యంత కీలకమైన వర్గమైన లింగాయత్లు కాంగ్రెస్ గెలుపునకు పెద్దపీట వేసినట్లు పేర్కొంటూ ముఖ్యమంత్రి పదవిని ఆశించారు. లింగాయత్ ముఖ్యమంత్రి లేకపోవడంతో ఆ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కుతాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా, త్వరితగతిన ఫలితాలు చూపించి, ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని కాంగ్రెస్ కూడా ఒత్తిడిలో ఉంది. కర్ణాటకలో మొత్తం 28 ఎంపీ స్థానాలు ఉండగా.. గత ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాలు వచ్చాయి. దీంతో ఈసారి ఎలాగైనా మెజార్టీ సీట్లు గెలుచుకోవాలని భావిస్తోంది.Read More And