News

India Vs Sri Lanka,శ్రీలంకకు షాక్.. ఆసియా కప్ ఫైనల్‌ మ్యాచ్‌కు కీలక ప్లేయర్ దూరం – big blow for sri lanka injured maheesh theekshana out of asia cup final


టీమిండియాతో ఆసియా కప్ 2023 ఫైనల్‌కి శ్రీలంక క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక స్పిన్నర్ మహీశ్ తీక్షణ గాయం కారణంగా దూరమయ్యాడు. ఆసియా కప్‌-2023 సూపర్‌-4లో పాకిస్థాన్‌తో మ్యాచు సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ తీక్షణ గాయపడ్డాడు. మ్యాచులో తొడ కండరాలు పట్టేసినా బౌలింగ్‌ కొనసాగించి తన స్పెల్‌ పూర్తి చేశాడు తీక్షణ. ఓ వికెట్ కూడా పడగొట్టాడు.

తీక్షణ గాయంపై మ్యాచు అనంతరం స్కానింగ్ తీయించగా.. గాయం తీవ్రమైనదిగా తేలినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఫలితంగా అతడు ఆసియా కప్‌-2023 ఫైనల్‌కు దూరమైనట్లు తెలిపింది. మహీశ్‌ తీక్షణ స్థానంలో సహన్‌ అరాచిగేను రీప్లేస్ చేసినట్లు పేర్కొంది. తీక్షణకు తమ వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందించనున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించింది.

తీక్షణ స్థానంలో జట్టులోకి వచ్చిన 27 ఏళ్ల సహన్‌ అరాచిగే.. బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌. లెఫ్టాండ్‌ బ్యాటర్‌ అయిన అతడు.. రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌బ్రేక్‌ బౌలింగ్ కూడా చేయగలడు‌. జింబాబ్వేలో వన్డే వరల్డ్‌కప్‌-2023 క్వాలిఫయర్స్‌ సందర్భంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

ఆసియా కప్‌కు ముందే శ్రీలంక జట్టులోని కీలక ప్లేయర్లు గాయంతో దూరమయ్యారు. స్టార్ ఆల్ రౌండర్ వానిండు హసరంగతో పాటు దుష్మంత చమీర, మధుశనక, లాహిరు కుమార ఆసియా కప్‌లో ఆడలేదు. తాజాగా తీక్షణ సైతం గాయపడ్డాడు. మొత్తంగా ప్రస్తుతం శ్రీలంక జట్టులోని ఐదుగురు బౌలర్లు గాయాలతో ఇబ్బంది పడుతున్నారు.

ఇక ఆసియా కప్ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన శ్రీలంక.. ఓ దశలో లీగ్ దశ నుంచే ఇంటి బాట పట్టేలా కనిపించింది. అఫ్గనిస్థాన్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచులో గెలిచి సూపర్-4 చేరింది. సూపర్-4లో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. సూపర్-4లో భారత్‌తో జరిగిన మ్యాచులో మాత్రం ఓడిపోయింది.

తొలుత భారత్‌ను 213 పరుగులకే పరిమితం చేసింది. కానీ స్వల్ప స్కోరును ఛేదించలేక చతికిలపడింది. 172 పరుగులకే ఆలౌట్ అయి.. 41 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక ఆదివారం జరగనున్న ఫైనల్‌లో గెలిచి.. ట్రోఫీని వరుసగా రెండో ఏడాది సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఫైనల్ మ్యాచు కోసం భారత్ కూడా తుది జట్టులో భారీ మార్పులు చేయనుంది. దాదాపు 5 మార్పులతో టీమిండియా ఫైనల్ మ్యాచ్ ఆడే అకాశం ఉంది. అక్షర్ పటేల్ గాయపడటంతో వాషింగ్టన్ సుందర్‌ను ఇండియా నుంచి శ్రీలంకకు రప్పించింది. కొలంబో వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచు ప్రారంభం కానుంది.

Related Articles

Back to top button