News

Father Arrears,తండ్రి ఎరియర్స్‌ కోసం పోరాటం.. ఎట్టకేలకు విజయం సాధించిన 88 ఏళ్ల వృద్ధుడు – 88 year old from karnataka finally wins decades long legal battle for father arrears


ప్రభుత్వం నుంచి తన తండ్రికి రావాల్సిన బకాయల కోసం 88 ఏళ్ల వృద్ధుడు చేస్తోన్న న్యాయపోరాటం ఫలించింది. అతడి తండ్రికి రావాల్సిన రూ.37 వేలను చెల్లించాలని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని చిక్‌మగళూరు జిల్లా కడూరు తాలూకాకు చెందిన టీకే శేషాద్రి అయ్యంగార్‌ అనే వ్యక్తి తంగలి గ్రామంలో 1979 నుంచి 1990 వరకు గ్రామ సేవకుడిగా పని చేశారు. కంపాసినేట్‌ అలవెన్స్‌ కోసం ఆయన సంబంధిత అధికారులకు ఎన్నో అర్జీలు, దరఖాస్తులు చేసుకున్నా ఫలితం లేకపోయింది.

దీనిపై చివరకు గ్రామ సంఘం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌‌పై విచారణ చేపట్టిన కోర్టు.. నెలకు రూ.100 అలవెన్స్‌ను చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 1997లో కోర్టు తీర్పు రాగా, ప్రభుత్వ అలవెన్స్‌ అందుకోకుండానే శేషాద్రి కన్నుమూశారు. దాంతో అతడి కుమారుడు రాజన్‌ (88) ప్రభుత్వం నుంచి తండ్రికి రావాల్సిన ఎరియర్స్‌ కోసం దశాబ్దాలుగా న్యాయపోరాటం సాగిస్తున్నాడు. మొదటిసారిగా 2017లో స్థానిక ఎమ్మార్వో ఆఫీసులో రాజన్ వినతిపత్రం సమర్పించారు. కానీ, తహశీల్దార్ దానిని తిరస్కరించారు.

కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌‌‌‌లో దరఖాస్తు చేయగా అక్కడ కూడా చుక్కెదరయ్యింది. చాలా అధికారులు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు రాజన్‌ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. 2021లో రాజన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం వృద్ధుడికి ఊరటనిచ్చే తీర్పు చెప్పింది. దీంతో అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం లభించినట్టయ్యింది. దివంగత శేషాద్రి ఉద్యోగ సంఘంలో ఒకరని.. ఆయనకు రావాల్సిన రూ.37వేల ఎరియర్స్‌ను చెల్లించాలని జస్టిస్ పీఎస్ దినేశ్ కుమార్, జస్టిస్ జి శివశంకర్ గౌడల డివిజన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

రాష్ట్ర ప్రభుత్వ వాదనలను తిరస్కరించింది. పిటిషనర్‌కు తాత్కాలిక పరిహారం మంజూరు చేయనందున బకాయిలు పొందడానికి అనర్హుడని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించింది. తహశీల్దార్ తీరును తప్పుబట్టిన కోర్టు.. పిటిషనర్ తండ్రి గ్రామ అధికారిగా పని చేస్తున్నారనే విషయంలో ఎటువంటి వివాదం లేదని, బకాయిల క్లెయిమ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని వ్యాఖ్యానించింది. పిటిషనర్ తండ్రికి తాత్కాలిక భత్యం అందనందున బకాయిలకు అర్హత లేదని తహశీల్దార్ చెప్పడం పూర్తిగా సమర్థనీయం కాదని తెలిపింది.

ఇంకా, 1990 నుంచి 1994 వరకు అలవెన్స్, బకాయిలను నెలకు రూ. 500 చొప్పున చెల్లించాలని హైకోర్టు పేర్కొంది. అర్హత పొందిన తేదీ నుంచి మొత్తంపై 10 శాతం సాధారణ వడ్డీని కూడా చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం చెల్లించడానికి 3 నెలల గడువు విధించింది.

Read More Latest National News And Telugu News

Related Articles

Back to top button