News

Exit Polls, Karnataka Result 2023: కాంగ్రెస్ కొత్త స్కెచ్.. ఆపరేషన్ ఆకర్ష్ షురూ! – operation akarsh started before the karnataka results


Karnataka Result 2023: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు.. అధికార బీజేపీ, కాంగ్రెస్ రెండూ తమ తమ వ్యూహాలపై చర్చించి.. స్వతంత్ర అభ్యర్థులను సంప్రదించేందుకు మేధోమథనం చేశాయి. ఎన్నికల తర్వాత వెలువడిన వివిధ సర్వేలు బీజేపీ, కాంగ్రెస్‌ (Congress Party) మధ్య గట్టిపోటీని సూచిస్తున్నందున.. గెలిచే అవకాశం ఉన్న స్వతంత్ర అభ్యర్థులను ఆకర్షించాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) నివాసంలో.. పార్టీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇన్‌ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా, పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ డి.కే. శివకుమార్, మాజీ ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర, ఇతర నేతల మధ్య తీవ్ర చర్చ జరిగింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను ఐక్యంగా ఉంచే మార్గాలపై కాంగ్రెస్ నేతలు చర్చించారు. స్పష్టమైన మెజార్టీ లేని పక్షంలో స్వతంత్ర అభ్యర్థుల (independent candidates) ను సంప్రదించడం పై కూడా చర్చించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు

224 మంది సభ్యుల అసెంబ్లీకి మే 10న జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 73.19 శాతం ఓటింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్‌ (Exit polls) లో చాలా వరకు కాంగ్రెస్‌కు బీజేపీ (BJP)పై స్వల్ప ఆధిక్యం లభిస్తుందని అంచనా వేయగా.. హంగ్ అసెంబ్లీ (Hung assembly) ఏర్పడే అవకాశం కూడా ఉందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. ఎమ్మెల్యే విషయంలో.. ఈసారి జాగ్రత్తగా ఉంటామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకునే బాధ్యతలను కీలక నేతలకు అప్పగించారు.

మరోవైపు.. బీజేపీ స్పష్టమైన మెజారిటీతో ‘మ్యాజిక్ ఫిగర్’ దాటుతుందని సీఎం బొమ్మై (CM Bommai) విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. కొత్తగా ఎన్నికైన తమ ఎమ్మెల్యేలను ఏకతాటిపై నిలిపేందుకు బీజేపీ నేతలు కూడా వ్యూహం పన్నినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. స్వతంత్ర అభ్యర్థులతో పాటు.. గెలిచే అవకాశం ఉన్న చిన్న పార్టీల అభ్యర్థులను సంప్రదించేందుకు బీజేపీ (BJP) ప్రయత్నిస్తోంది.

అదే సమయంలో జేడీఎస్ (JDS) చీఫ్ దేవె గౌడ కూడా కీలక సమావేశం నిర్వహించారు. గెలిచే అవకాశం ఉన్న పార్టీ అభ్యర్థులతో దేవెగౌడ మాట్లాడారు. కొందరు అభ్యర్థులను పిలిచి.. పార్టీకి, నాయకత్వానికి విధేయులుగా ఉండాలని సూచించారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం సింగపూర్‌లో ఉన్న కుమారస్వామి (Kumaraswamy) ఈ సమావేశం లో లేరు. శనివారం ఉదయం ఆయన కర్ణాటక చేరుకోనున్నారు.

Related Articles

Back to top button