Chandrabose,ఆస్కార్ వచ్చాక తొలిసారి తిరుమలకు.. స్వామిని ఇంత దగ్గరగా ఎప్పుడూ చూడలేదు: చంద్రబోస్ – lyricist chandrabose visits tirumala temple first time after winning oscar
తిరుమల శ్రీవారంటే తనకు, తన కుటుంబసభ్యులకు అమితమైన భక్తి అని చంద్రబోస్ తెలిపారు. నిత్యం ఆయణ్ని భక్తితో కొలుస్తామని తెలిపారు. స్వామి వారిని అతి దగ్గరగా దర్శించుకోవడం ప్రత్యేక అనుభూతిని కలిగించిందని.. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా.. గుండెంతా నిండిపోయిన భావన కలిగిందని తెలిపారు. ఎంతో ఆనందం కలిగిందని చంద్రబోస్ చెప్పారు.
దర్శనం అనంతరం చంద్రబోస్ కుటుంబసభ్యులకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ‘స్వామి వారి దర్శన భాగ్యం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. స్వామి వారి కృప నా మీద ఎల్లకాలం ఇలాగే ఉండాలి. మీ అందరి ప్రేమ, అందిరి అభిమానం ఇలాగే ఉండాలి’ అని చంద్రబోస్ అన్నారు.
ప్రస్తుతం ఈ సినిమాలకు పనిచేస్తున్నా..
ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’, వెంకటేష్ ‘సైంధవ’, రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’, పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’తో పాటు రాంచరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో వస్తున్న సినిమాకూ సాహిత్యం అందిస్తున్నానని చంద్రబోస్ తెలిపారు. రాఘవేంద్రరావు ప్రాజెక్టు కోసం కూడా పనిచేస్తున్నానని చెప్పారు. వీటి తర్వాత ఇంకా చాలా ప్రాజక్టులు ఉన్నాయని వెల్లడించారు. ‘అన్ని సినిమాలకు మంచి సాహిత్యం అందిస్తున్నా. మీ అందరినీ అలరిస్తాయనే నమ్మకం ఉంది’ అని చంద్రబోస్ చెప్పారు.