Bharat,Special Parliament Sessions: ప్రత్యేక పార్లమెంటు సమావేశాల ఎజెండాపై వీడని ఉత్కంఠ.. ఒకరోజు ముందు అఖిలపక్ష సమావేశం – special sessions agenda unknown centre calls all party meet day before
ఇక ఈనెల 18 నుంచి 22 వరకు జరిగే ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. పాత పార్లమెంటు భవనంలో 18 న ప్రారంభమై 19 వ తేదీన కొత్త పార్లమెంటు భవనంలోకి తరలించనున్నారు. ఇక ప్రత్యేక సమావేశాల తేదీలకు సంబంధించి పలువురు పార్టీల నేతలు బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం గణేష్ చతుర్థి పండగ ఉన్న నేపథ్యంలో ఆ రోజు సమావేశాలు నిర్వహించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి చాలా ముఖ్యమైన పండగ అని.. ఆ రోజు సమావేశాలు కొనసాగించడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని.. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ ప్రియాంక చతుర్వేది విమర్శించారు. మరోవైపు.. పార్లమెంటు సమావేశాల షెడ్యూల్ను మార్చాలని ఎన్సీపీ ఎంపీ, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే డిమాండ్ చేశారు.
ఇక సమావేశాల ఎజెండా గురించి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలను సంప్రదించకుండానే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు పిలుపునిచ్చారని అసహనం వ్యక్తం చేశారు. అసలు ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల గురించి ఎలాంటి సమాచారం లేదని.. ఎజెండా కూడా విడుదల చేయలేదని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీకి సోనియా గాంధీ పలు సూచనలు చేశారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు, దేశంలో విస్తరిస్తున్న మత ఘర్షణలు, చైనాతో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం, ఇటీవల చైనా విడుదల చేసిన కొత్త మ్యాప్ వంటి అంశాలను ప్రత్యేక సమావేశాల ఎజెండాలో చేర్చాలని సోనియాగాంధీ.. ప్రధానిని డిమాండ్ చేశారు.
అయితే అమృత్ కాల్, భారత్ అభివృద్ధి చెందిన దేశం అనే అంశాలు ఈ ప్రత్యేక సమావేశాల ఎజెండాలో చర్చించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. వీటితోపాటు ఇటీవల ఇస్రో సాధించిన ఘన విజయమైన చంద్రయాన్ 3.. సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సుకు సంబంధించి చర్చిస్తారని పేర్కొన్నాయి. ఇక ఇటీవల ఇండియా పేరును భారత్గా మార్చనున్నారనే ఊహాగానాలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం తీవ్ర ఉత్కంఠగా మారింది.
Read More Latest National News And Telugu News