bengaluru traffic, ట్రాఫిక్లో బైక్ వెనుక సీట్లో ల్యాప్టాప్తో పనిచేస్తూ.. ఐటీ ఉద్యోగిని ఫోటో వైరల్ – bengaluru woman starts working on laptop on rapido bike after stuck in traffic
ఆఫీస్కు వెళ్లేందుకు ఓ యువతి ర్యాపిడో బైక్ బుక్ చేసుకొని బయల్దేరింది. అప్పటికే ఆ మార్గంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది. ఆఫీస్కు చేరుకోవడం ఆలస్యం అవుతుందనుకుందో ఏమో.. బైక్ వెనుక సీట్లో కూర్చొని ఉండే, తన బ్యాగులో నుంచి ల్యాప్టాప్ బయటకు తీసింది. సీరియస్గా ఏదో టైప్ చేస్తూ కనిపించింది. అదే మార్గంలో ప్రయాణిస్తున్న మరి కొంత మంది కారులో నుంచి ఆ దృశ్యాన్ని తమ సెల్ఫోన్లో బంధించారు. సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది.
బెంగళూరులోని కోరమంగళ – అగార మార్గంలో ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఈ ఫోటో తీసినట్లు తెలుస్తోంది. ‘బెంగళూరులో పీక్ అవర్స్. ఓ మహిళ ర్యాపిడో బైక్పై ఆఫీసుకు వెళుతూ ల్యాప్టాప్తో పనిచేస్తున్నారు’ అనే క్యాప్షన్తో ఈ ఫోటోను షేర్ చేశారు.
ప్రపంచంలోనే రద్దీ నగరాల్లో ఒకటి
ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉండే నగరాల్లో బెంగళూరు ఒకటి. 2022లో CBD (సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్) ప్రాంతంలో నిర్వహించిన సర్వే ప్రకారం.. ప్రయాణికులు 10 కి.మీ. దూరం ప్రయాణించేందుకు 29 నిమిషాల 10 సెకన్లు పట్టింది. 2021లో సిటీ సెంటర్లో రద్దీ సమయంలో సగటు వేగం గంటకు 18 కి.మీ. ఉండగా.. 2022లో అది 14 కి.మీ.గా ఉంది.
బెంగళూరులోని బిజీ టెక్ కారిడార్లో మంగళవారం (మే 16) ఓ ట్రక్కు చెట్టును ఢీకొనడంతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచిస్తూ.. ట్రాఫిక్ పోలీసులు ప్రకటనలు కూడా చేశారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో నగరంలోని అన్ని మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటోంది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.