News

bangalore ap infosys techie death, బెంగళూరులో విషాదం.. భారీ వర్షంతో అండర్ పాస్‌లోకి నీళ్లు, కారు మునిగి కృష్ణాజిల్లా టెకీ దుర్మరణం – infosys techie from krishna district dies after car stuck in flooded underpass


బెంగళూరులో విషాద ఘటన జరిగింది. నగరంలో కురిసిన వర్షం కారణంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా తేలప్రోలుకు చెందిన భానురేఖ ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌ నుంచి ఆదివారం మధ్యాహ్నం బెంగళూరు వచ్చారు. కారులో వర్షానికి విధాన సౌధకు సమీపంలోని కేఆర్‌ సర్కిల్ దగ్గరకు చేరుకునే సమయానికి వర్షం తీవ్రమైంది. ఇంతలో అండర్‌పాస్‌లోకి వర్షపు నీరు భారీగా చేరి ఉంది. ఆమె ఆ నీటిని అంచనా వేయలేకపోయారు. అండర్‌ పాస్‌లో కొంతదూరం వెళ్లేసరికి కారు పూర్తిగా మునిగిపోయింది.

ఈ క్రమంలో కారులో ఉన్న ఆరుగురు నీటిలో చిక్కుకుపోయారు. వీరు భయంతో కాపాడాలంటూ పెద్దగా కేకలు వేశారు. గమనించిన స్థానికులు నలుగురిని బయటకి తీశారు.. మరో ఇద్దరిని తేవడం కష్టంగా మారడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, కార్పొరేషన్ సిబ్బంది గజ ఈతగాళ్లను రంగంలోకి దించి కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలో భానురేఖ ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన కుటుంబసభ్యులను సెయింట్ మార్థాస్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన గురించి తెలియగానే ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య వెళ్లి బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భానురేఖ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. కుటుంబసభ్యులందరి చికిత్స ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

భానురేఖకు కొద్దిరోజుల క్రితం బెంగళూరులోని ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం వచ్చింది. ఆమె పదిరోజుల క్రితం తేలప్రోలుకు వచ్చి అందరితో సరదాగా గడిపారు. ఆ తర్వాత కుటుంబసభ్యులతో కలిసి బెంగళూరు వెళ్లారు. ఇంతలో ఈ ఘోరం జరిగింది. భానురేఖ మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు.

బెంగళూరులో ఆదివారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం కాగా.. భారీగా గాలులకు పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. బెంగళూరులో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అవసరమైన చోట సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు.

మరోవైపు ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్‌కు ఉన్న జీవో ట్రాఫిక్‌ను ఉపసంహకరించుకున్నారు. ఇప్పటికే బెంగళూరు పోలీస్ కమిషనర్‌కు ఈ విషయాన్ని తెలిపారు. జీరో ట్రాఫిక్ ప్రోటోకాల్‌ కారణంగా రోడ్లపై ట్రాఫిక్‌ స్తంభిస్తోందని.. ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అంతేకాదు తనకు ప్రజలు, నేతలు గౌరవంగా తెచ్చే బోకేలు, శాలువాలను తీసుకురావొద్దని సూచించారు.. వాటిని స్వీకరించకూడదని నిర్ణయం తీసుకున్నారు. తనకు పుస్తకాలను ఇవ్వొచ్చన్నారు.

  • Read Latest Andhra Pradesh News and Telugu News

Related Articles

Back to top button