News

atchannaidu, ఏపీలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీడీపీకి వచ్చే ఎమ్మెల్యే సీట్లివే.. ఊహించని నంబర్: అచ్చెన్న – tdp leader atchannaidu inaugurated ntr statue


రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగు దేశం పార్టీకి 160 సీట్లు రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. కాబట్టి, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెదకాకానిలో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు (ఎన్టీఆర్) విగ్రహాన్ని ఆదివారం సాయంత్రం అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, అశోక్ బాబు, నన్నపనేని రాజకుమారి, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అంటే వ్యక్తి కాదు.. ఒక శక్తి అని అన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. అందుకే, ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు దేశ విదేశాల్లో కూడా జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వచ్చిన వ్యక్తికి, 16 మాసాలు జైల్లో ఉన్న వ్యక్తికి ఓటు వేసి ప్రజలు తప్పు చేశారని పేర్కొన్నారు. పేద ప్రజలను మోసం చేయాలని.. అమరావతిని విచ్ఛిన్నం చేయాలని సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని విమర్శించారు. నిర్మించని రింగ్ రోడ్డులో అవకతవకలు జరిగాయని డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.

చివరికి పేపర్, టీవీ తనకు లేదని సీఎం జగన్ అబద్ధాలు ఆడుతున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. రూ. 510 కోట్ల ఆస్తి ఉన్న సీఎం జగన్ పేద ముఖ్యమంత్రా? అని అచ్చెన్న ప్రశ్నించారు. ఇక, రూ. 2 వేల నోట్లను ఎలా మార్చాలో తెలియక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంగారు పడుతున్నారని విమర్శించారు. సీఎం జగన్ రూ.10 లక్షల కోట్లు అప్పు చేశారని.. రూ. 3 లక్షల కోట్లు ప్రజలపై పన్నుల భారం వేశాడని దుయ్యబట్టారు. నాలుగేళ్ల పరిపాలనలో వైసీపీ ప్రభుత్వం ఎక్కడైనా భవనం, రోడ్డు వేసిందా? అని ప్రశ్నించారు.

ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. బలహీనవర్గాల ప్రజలకు ఎన్టీఆర్ అండగా నిలిచారని గుర్తు చేశారు. ఎందరో నాయకులను సమాజానికి అందించిన ఘనత ఎన్టీఆర్‌దే అని కొనియాడారు. ఆత్మాభిమానం గల ఎన్టీఆర్ వారసులుగా ఎవరికీ తలవంచమని చెప్పారు. సైకో పరిపాలనలో రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో చరిత్రను తిరగరాస్తామని తెలిపారు. 2024 ఎన్నికల్లో ప్రజలు వైసీపీపై తిరగబడటం ఖాయమన్నారు.

Related Articles

Back to top button