ashok khemka, 8 నిమిషాల పనికి రూ.40 లక్షల జీతం తీసుకుంటున్నా.. ఆ శాఖకు బదిలీ చేయండి.. ఐఏఎస్ అధికారి లేఖ – senior ias officer ashok khemka letter to haryana govt and seeks post of vigilance chief
రోజులో 8 నిమిషాలుండే పనికోసం తనకు ఏడాదికి రూ.40 లక్షలు చెల్లిస్తున్నారని.. అవినీతిని నిర్మూలించేందుకు తనకు విజిలెన్స్ చీఫ్గా బాధ్యతలు అప్పగించాలని లేఖలో పేర్కొన్నారు. హరియాణా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు అడిషినల్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్న ఆయనను అదే హోదాతో ఆర్కైవ్స్ శాఖకు ఇటీవల బదిలీ చేస్తూ హరియాణా సర్కారు నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్ల కెరీర్లో ఖేమ్కాకు ఇది 56వ బదిలీ. ఇదే అంశంపై జనవరి 23న ఐఏఎస్ అధికారి.. మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వానికి లేఖ రాశారు.
‘నన్ను జనవరి 9న ఆర్కైవ్స్ విభాగానికి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ శాఖ వార్షిక బడ్జెట్ రూ.4 కోట్లు. రాష్ట్ర బడ్జెట్లో ఆ మొత్తం 0.0025 శాతానికి కంటే తక్కువే.. అదనపు ప్రధాన కార్యదర్శిగా నేను ఏడాదికి రూ.40 లక్షలు వేతనం తీసుకుంటున్నాను. అంటే ఆర్కైవ్స్ విభాగం బడ్జెట్లో ఇది 10 శాతం. ఇక్కడ వారంలో గంటకు మించి పనిలేదు. మరోపక్క కొంతమంది అధికారులు తలకు మించిన పనితో సతమతమవుతున్నారు. ఇలా కొందరికి పనిలేకుండా, మరికొందరికి విపరీతంగా పని ఉండటం వల్ల ప్రజా ప్రయోజనాలు నెరవేరవు.
అవినీతిని చూసినప్పుడు.. నా మనసు ఎంతగానో అల్లాడిపోతోంది.. వ్యవస్థకు పట్టిన క్యాన్సర్ను వదిలించాలనే తపనతో నా కెరీర్ను పణంగా పెట్టాను.. అవినీతిని అంతంచేసే విషయంలో విజిలెన్స్ విభాగం ముఖ్యమైంది.. కెరీర్ చివరి దశలో ఉన్న నేను ఈ విభాగంలో సేవలు అందించాలనుకుంటున్నాను.. నాకు అవకాశం ఇస్తే.. అవినీతికి వ్యతిరేకంగా నిజమైన యుద్ధం జరుగుతుందని హమీ ఇస్తున్నాను’ అంటూ ఆశోక్ ఖేమ్కా లేఖలో పేర్కొన్నారు. లేఖలో 1987 పీకే చినసామీ Vs తమిళనాడు ప్రభుత్వం, ఇతరుల కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించారు.
కాగా, దీనిపై హరియాణా ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. ఇలాంటి అధికారులు అరుదుగా ఉంటారని పలువురు ప్రశంసిస్తున్నప్పటికీ.. తన కెరీర్లో ఎక్కువ సార్లు ఖేమ్కా అప్రాధాన్య పోస్టుల్లోనే కొనసాగారు. సగటున ఆరు నెలలకు ఒకసారి బదిలీ అయ్యారు. ఆర్కైవ్స్ శాఖలో పనిచేయడం ఇది నాలుగోసారి. తొలిసారిగా ఆయనను 2013లో ఆ శాఖకు బదిలీ చేశారు. 2025లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు.
గత అక్టోబర్లో తన బ్యాచ్ అధికారులకు ప్రమోషన్ లభించడంతో ట్విట్టర్లో అశోక్ ఖేమ్కా స్పందిస్తూ.. ‘‘భారత ప్రభుత్వానికి కొత్తగా సెక్రటరీలుగా నియమితులైన నా బ్యాచ్మేట్లకు అభినందనలు! ఇది సంతోషకర సందర్భం.. అయితే, ఇది మీలో ఒకరినైన నాకు నిస్పృహ కలిగిస్తోంది.. దీనికి చింతించాల్సిన అవసరం లేదు.. నేను కొత్త సంకల్పం, పట్టుదలతో ఉంటాను.’’ అని పేర్కొన్నారు.
Read Latest National News And Telugu News