Anantapur Ar Constable Died In Accident,అనంతపురం: ప్రాణం పోతున్నా భార్యకు ధైర్యం చెప్పిన కానిస్టేబుల్.. కన్నీళ్లు పెట్టించే ఘటన – anantapur ar constable kiran kumar died in road accident and wife anitha in critical condition
ఆత్మకూరుకు చెందిన కిరణ్కుమార్ 2003లో ఏపీఎస్పీ కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. ఆయన ఐదేళ్లు గ్రే హౌండ్స్లో పని చేసి.. 2014లో ఏపీఎస్పీ నుంచి ఏఆర్ కానిస్టేబుల్గా కన్వర్షన్ తీసుకున్నారు. కిరణ్ అనంతపురంలో విధులు నిర్వహిస్తున్నారు. భార్య అనిత శింగనమల మండలం తరిమెల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంటుగా ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.. ఈ మధ్యే నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న ఎస్బీఐ కాలనీలో సొంత ఇళ్లు కట్టుకొని ఉంటున్నారు. కిరణ్కుమార్ రోజూ భార్యను బైక్పై సోమలదొడ్డి క్రాస్ దగ్గరకు తీసుకెళ్లి బస్సు ఎక్కించి వచ్చేవారు.
బుధవారం కూడా రోజులాగే ఉదయం 7.30 గంటలకు భార్యతో కలిసి ఇంటి నుంచి బయలుదేరారు. నగర శివారులోని గోపాల్ దాబా దగ్గరకు హైవేపైకి రాగానే.. ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి కిందపడ్డారు. అదే సమయంలో వారిపై నుంచి గుర్తుతెలియని వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ రెండు కాళ్లు నుజ్జు నుజ్జయ్యాయి.. భార్య అనిత తల, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఇద్దరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఇద్దరినీ అంబులెన్స్లో బెంగళూరుకు తరలిస్తుండగా కిరణ్కుమార్ ప్రాణాలు కోల్పోయారు.. భార్య ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో.. భార్యాభర్తలిద్దరు కాపాడండి అంటూ వేడుకున్నారు. అక్కడ జనాలు గుంపులుగా నిలబడ్డారు.. ఏ ఒక్కరూ కాపాడటానికి ముందుకు రాలేదు. కనీసం వాళ్లకు మంచినీళ్లు అందించే ప్రయత్నం కూడా చేయలేదు.. భార్యాభర్తలే ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ‘నీకు, నాకు ఏమీ అవ్వదు. ధైర్యంగా ఉండు’అంటూ కిరణ్ కుమార్ భార్యకు ధైర్యం చెప్పారు. ఆ తర్వాత 108కి ఫోన్ చేయగా.. కొద్దిసేపటికి అంబులెన్స్ సిబ్బంది వచ్చి వారిని ఆసుపత్రికి తరలించారు.
కిరణ్ కుమార్ను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ కూడా తనను కాపాడాలంటూ పోలీసు సంఘం అధ్యక్షుడు త్రిలోక్నాథ్ను వేడుకున్నారు. ‘అన్నా మమ్మల్ని బతికించు.. పిల్లలున్నారు.. ఇదొక్కసారి ప్రాణాలు కాపాడన్నా’అంటూ రోదించారు. రోజూ అందరితో కలిసిమెలిసి చలాకీగా ఉండే కిరణ్ కుమార్ ఇలా ప్రాణాలు కోల్పోయాడని తెలిసి తోటి ఉద్యోగులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఆస్పత్రికి వెళ్లారు. కిరణ్ కుమార్ కూడా చిన్నతనంలో కష్టాలు పడ్డారు.. కూలీ పనులు చేసుసుకుంటూ తల్లిదండ్రులకు అండగా ఉన్నారు.. అటు చదువును కొనసాగించారు. ఇంటర్ పూర్తి చేసి పోలీసు ఉద్యోగం సాధించారు. తాను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.. పిల్లలతో జీవితం సాఫీగా సాగిపోతోంది. ఇంతలో రోడ్డు ప్రమాదం రూపంలో
ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.
- Read Latest Andhra Pradesh News and Telugu News