News
హైదరాబాద్వాసులకు గుడ్న్యూస్.. గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు ప్రారంభం.. ప్రత్యేకతలు అదరహో..!
హైదరాబాద్ నగరవాసులకు టీఎఎస్ ఆర్టీసీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే నగరవాసుల సౌకర్యార్థం.. రవాణా వ్యవస్థను మెరుగుపర్చటంలో భాగంగా రకరకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన .. ఇప్పుడు.. గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను తీసుకొస్తోంది. పర్యావరణ హితమైన ఈ బస్సులను ఈరోజు (సెప్టెంబర్ 20వ తేదీన) రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించనున్నారు. దీంతో నగరవాసులకు మరింత సుఖవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. నగరంలో పర్యావరణహితమైన బస్సులను నడిపించాలని కసరత్తు చేస్తున్న టీఎస్ ఆర్టీసీ.. ఈ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. నగరంలో మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తుండగా.. అందులో మొదటి విడతగా 25 బస్సులను ఈరోజు ప్రారంభించనున్నారు. ఈ బస్సులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గచ్చిబౌలి స్టేడియం దగ్గర ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ కూడా పాల్గొననున్నారు. మిగిలిన 25 బస్సులను నవంబరు నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఈ బస్సులు వంద శాతం పర్యావరణహితమైనవిగా ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం కూడా ఉంది. 3 గంటల నుంచి 4 గంటల లోపు వంద శాతం పూర్తి ఛార్జింగ్ అవ్వడమే కాకుండా క్యాబిన్, సెలూన్లో రెండు చోట్ల సెక్యూరిటీ కెమెరాలు, ఒక నెల బ్యాకప్ సదుపాయాలు కూడా ఉన్నాయి. గ్రీన్ లగ్జరీ ఏసీ బస్సుల ప్రత్యేకతలివే…
- 12 మీటర్ల పొడవు గల ఈ గ్రీన్ లగ్జరీ ఏసీ బస్సులు అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా మెరుగైన సౌకర్యాలు కల్పించారు.
- 35 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సుల్లో ప్రతి సీటు వద్ద మొబైల్ ఛార్జింగ్ సౌకర్యంతో పాటు రీడిండ్ ల్యాంప్లు కూడా ఏర్పాటు చేశారు.
- ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ కూడా ఉంటుంది. వాటిని టీఎస్ ఆర్టీసీ కంట్రోల్ రూంకు కనెక్ట్ చేస్తారు.
- ప్రతి బస్సులోనూ 2 సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. వీటికి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్ కూడా ఉంటుంది.
- బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా సైతం ఉంటుంది.
- బస్సుకు ముందు వెనుక ఎల్ఈడీ బోర్డులు ఉంటాయి. అందులో డెస్టినేషన్ వివరాలు డిస్ప్లే అవుతుంటాయి.
- అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి.. నివారించేందుకు బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం(ఎఫ్డీఎస్ఎస్)ను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్ అడ్రస్ సిస్టం కూడా ఈ బస్సుల్లో ఉంటుంది.