News

లోకేష్ పాదయాత్రలో ‘జై జగన్’ నినాదాలు.. తీవ్ర ఉద్రిక్తత!



తెలుగు దేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర 35వ రోజు ఎంజేఆర్‌ కళాశాల అగ్రహారం వద్ద అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. అగ్రహారం వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, కార్యకర్తలు లోకేష్‌తో కలిసి నడిచారు. అయితే, పాదయాత్ర పీలేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ దాటాక స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వ్యవసాయ మార్కెట్‌ సమీపంలో నారా లోకేష్ పాదయాత్రను చూసి కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ‘జై జగన్‌’ అనే నినాదాలు చేశారు. దీన్ని గమనించిన టీడీపీ కార్యకర్తలు వారికి ఎదురెళ్లారు. దీంతో వారు తప్పించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాయచోటి డీఎస్పీ శ్రీధర్‌, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.మరోవైపు 35 వ రోజు యువగళం పాదయాత్ర సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అనంతరం పీలేరు బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడుతూ.. ప్రజల ఉత్సాహం, స్పీడ్ చూస్తుంటే.. ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం ఖాయమనిపిస్తోందన్నారు. ఒక్క ఛాన్స్ అని వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు.ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని మాట తప్పారని.. 6.3 లక్షల ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశారని లోకేష్ ఆరోపించారు. ఉద్యోగులు, పోలీసుల సమస్యలను చూస్తే బాధగా ఉందని.. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అన్నారు. ఉద్యోగులు, పోలీసుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గతంలో జాబ్ క్యాపిటల్ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఏపీ వచ్చేదని.. ఇప్పుడు గంజాయి క్యాపిటల్ అని సెర్చ్ చేస్తే ఏపీ వస్తుందన్నారు. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే గంజాయి స్మగ్లర్లకు చుక్కలు చూపించేవారని లోకేష్ అన్నారు. వైసీపీ పాలనలో టెన్త్ విద్యార్థులతో గంజాయి విక్రయం, వినియోగం చేయిస్తున్నారని ఆరోపించారు. తాము వచ్చాక గంజాయి స్మగ్లర్లను తరిమికొట్టే బాధ్యత నాదన్నారు. ఇక, విశాఖ పెట్టుబడుల సదస్సుల్లో రూ.76 వేల కోట్ల పెట్టుబడి పెడతామని ఓ కంపెనీ వచ్చిందని.. గూగుల్ లో చూస్తే ఆ కంపెనీ పెట్టుబడి కేవలం లక్ష రూపాయిలన్నారు. ఆ కంపెనీ పులివెందులదని తెలిసిందని ఎద్దేవా చేశారు. కేవలం 50 మంది ఉండే మరో కంపెనీ రూ. వేల కోట్ల పెట్టుబడి పెడుతుందంట.. నమ్ముదామా అని అన్నారు.

Related Articles

Back to top button