News

నాలో ఒక భాగం అక్కడే వదిలేసినట్టు అనిపిస్తోంది.. భువనేశ్వరి భావోద్వేగం



స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి.. 14రోజుల రిమాండ్‌లో భాగంగా రాజమండ్రి సెంట్రల్‌లో జైలులో ఉన్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. నాలుగు గంటల సమయంలో.. ఆయన భార్య భువనేశ్వరితో పాటు లోకేష్ దంపతులు బాబును కలిశారు. అయితే.. బాబును కలిసిన అనంతరం మీడియాతో భావోద్వేగంగా మాట్లాడారు. చంద్రబాబును జైలులో చూసి బయటకు వస్తుంటే.. తనలో ఒక భాగం అక్కడే వదిలేసి వస్తున్నట్టుగా అనిపించిందంటూ బరువైన హృదయంతో మాట్లాడారు. నిర్మించిన బిల్డింగ్‌లోనే ఆయనను కట్టిపడేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జైలులో నెంబర్ వన్ సౌకర్యాలున్నట్టుగా ఏం కనిపించలేదని అనుమానం వ్యక్తం చేశారు. చన్నీళ్లతో స్నానం చేయాల్సి వస్తోందని సౌకర్యాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన సెక్యూరిటీ గురించే తనకు భయంగా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు భువనేశ్వరి. జైలులో కూడా ఆయన ప్రజల కోసమే ఆలోచిస్తున్నారన్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నా అని చెప్పినట్టు తెలిపారు. అయితే.. ఇది కుటుంబానికి చాలా కష్ట సమయమని భువనేశ్వరి చెప్పుకొచ్చారు. 24 గంటలు ప్రజల కోసం ఆలోచించే చంద్రబాబును.. ఏమీ లేని కేసులో అరెస్టు చేసి ఇలా బందీని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు కుటుంబం కంటే.. ప్రజలే ముఖ్యమని చాలా సార్లు చెప్పారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ.. ఎప్పటికీ ప్రజల కోసమే నిలబడుతుందని భువనేశ్వరి తెలిపారు. తెలుగు ప్రజల హక్కుల కోసం నిరంతరం శ్రమించిన బాబు.. ఈరోజు ఇలా జైలులో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇలాంటి సమయంలోనే.. తెలుగు ప్రజలు, టీడీపీ శ్రేణులు ఆయనకు ధైర్యంగా నిలబడాలని భువనేశ్వరి కోరారు.

Related Articles

Back to top button