News
చివరికి ఉ** పోయాలన్నా వాళ్లు ఢిల్లీకి పోవాలే.. కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
విపక్ష పార్టీ నేతలపై మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో ఐటీ టవర్తో పాటు న్యాక్ బిల్డింగ్ను ప్రారంభించిన తర్వాత ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన కేటీఆర్.. తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ గల్లీలో బాసులు ఉంటే.. కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు మాత్రం బాసులు ఢిల్లీలో ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. చివరిని అది పోయాలన్నా (మూత్రం) కూడా ఢిల్లీకే పోవాలే అంటూ కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలను ఉద్దేశించి కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలంతా నిలబడాలన్నా, కూర్చోవాలన్నా ఢిల్లీకే పోవాలన్నారు. ఎన్నికల్లో ఒక్క హామీ ఇవ్వాలన్నా.. ఇచ్చినా దాన్ని అమలు చేయాలన్నా.. మళ్లీ ఢిల్లీకే పోవాలంటూ ఆరోపించారు. వాళ్లు నోరు తెరవాలన్నా.. తెరిచిన నోరు మూయాలన్నా కూడా మళ్లీ ఢిల్లీకే పోవాలంటూ తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో సీటు కావాలన్నా.. గాంధీ భవన్ గేటు దాటాలన్నా ఢిల్లీకే పోవాలంటూ కేటీఆర్ తనదైన శైలిలో కామెంట్లు చేశారు. ఒక రోడ్డు వేయాలన్నా.. అదే రోడ్డు మీద కాంగ్రెస్, బీజేపీ నేతలు తన్నుకున్నా.. ఆ పంచాయితీ కూడా ఢిల్లీకే పోవాలంటూ సెటైర్లు వేశారు. ఈ పార్టీలకు చెందిన నేతలు నలుగురు కలిసి ఒక దగ్గర కూర్చోలేరు కానీ.. కేసీఆర్ను ఓడగొడతామని సవాళ్లు చేస్తున్నారంటూ మండిపడ్డారు. వచ్చే ఎన్నికలు.. ఢిల్లీకి బానిసలైనా కాంగ్రెస్, బీజేపీ నేతలకు.. తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోటీ అంటూ అభివర్ణించారు కేటీఆర్. పౌరుషం ఉన్న తెలంగాణ బిడ్డలు ఈ ఢిల్లీ గద్దలను తరిమికొట్టాలని సూచించారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కూడా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నికార్సయిన తెలంగాణవాది కాదని.. తెలంగాణకు పట్టిన వ్యాధి అంటూ సెటైర్లు విసిరారు. ఉద్యమకారులపైకి రైఫిల్ తీసుకెళ్లిన రైఫిల్ రెడ్డి అంటూ వ్యంగ్యాస్త్రాలు ఎక్కు పెట్టారు కేటీఆర్.