News

ఖాతాదారుల సొమ్ము క్రికెట్ బెట్టింగ్‌లకు.. ఏకంగా రూ.8.65 కోట్లు, ఈ బ్యాంకు అధికారి మహా ముదురు!



వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేటు బ్యాంకు డిప్యూటీ మేనేజర్ చేతివాటం ప్రదర్శించాడు. పని చేస్తున్న బ్యాంకును బురిడి కొట్టించి సుమారు రూ. 8.5 కోట్లు కొల్లగొట్టాడు. అలా దోచుకున్న ఖాతాదారుల సొమ్మును ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లకు వాడుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీమాబాద్‌కు చెందిన బైరిశెట్టి కార్తీక్‌ నర్సంపేట పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అయితే అతడు ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లకు అలవాటుపడ్డాడు. దీంతో బ్యాంకు నుంచి ఖాతాదారుల సొమ్ము సొంతానికి వాడుకోవటం ప్రారంభించాడు. బ్యాంకులో బంగారం కుదవపెట్టి తీసుకున్న లోన్ చెల్లించడానికి వచ్చిన ఖాతాదారుల నుంచి నగదు తీసుకొని, వారికి బంగారం ఇస్తూ.. ఆ డబ్బు బ్యాంకులో జమ చేయకుండా సొంతానికి వాడుకున్నాడు. కొంత డబ్బు చెల్లించి ఆ ఖాతా రెన్యూవల్‌ చేసుకున్నట్లు నకిలీ లావాదేవీలు జరిపాడు. కొన్నిసార్లు బ్యాంకు లాకర్లలో ఖాతాదారులు పెట్టిన బంగారు నగలు బయటకు తీసి, బినామీ పేరుతో అదే బంగారాన్ని తన బ్యాంకులోనే కుదువపెట్టేవాడు. ఇలా వచ్చిన లోన్ డబ్బులతో ఆన్‌లైన్‌ బెట్టింగులు పాల్పడ్డాడు. ఇలా అటు ఖాతాదారులను, ఇటు బ్యాంకును మోసం చేస్తూ వచ్చాడు. కొన్నిసార్లు కస్టోడియన్‌, ఆడిటర్‌ సంతకాలు ఫోర్జరీ చేసి అక్రమాలకు పాల్పడ్డారు. 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు మొత్తం 128 మంది ఖాతాల నుంచి రూ.8.65 కోట్లు వాడుకున్నట్లు బ్యాంకు అడిటింగ్ సమయంలో తేలింది. బ్యాంకు ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. విచారణ అనంతరం రిమాండుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఖాతాదారుల సొమ్మును ఎలా తిరిగిస్తారు ? తమకు తెలియకుండానే బంగారం కుదవపెట్టడంతో బ్యాంకు అధికారులు ఖాతాదారులకు నష్టం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

Related Articles

Back to top button