News
ఒక్కొక్కరి అకౌంట్లోకి 4 లక్షలు.. సింగరేణి ఉద్యోగులకు శుభవార్త
సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు కేసీఆర్ సర్కారు ఎగిరి గంతేసే శుభవార్త వినిపించింది. ఉద్యోగులకు, కార్మికులకు పెండింగ్ ఉన్న ఏరియర్స్ అన్ని ఒకేసారి చెల్లించేలా సింగరేణి ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 21వ తారీఖునే ఉద్యోగులందరి అకౌంట్లలో ఈ ఏరియర్స్ వేయనున్నట్టు సింగరేణి యాజమాన్యం పేర్కొంది. దీంతో.. ఒక్కో కార్మికుడి అకౌంట్లో సుమారు 4 లక్షల మేర ఏరియర్స్ పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 40 వేల ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. కార్మికులకు చెల్లించాల్సిన 11వ వేతన ఒప్పందం 23 నెలల పెండింగ్ బకాయిలు రూ.1726 కోట్లను విడుదల చేయనున్నారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా ఇంత పెద్దమొత్తంలో వేతన బకాయిలను చెల్లిస్తున్నట్టు యాజమాన్యం చెప్తొంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. సీఎం కేసీఆర్, టీజీబీకేఎస్ అధ్యక్షురాలు కవిత ప్రత్యేక చొరవతో కార్మికులకు ఒకేసారి ఏరియర్స్ బకాయిలు అందనున్నాయి. 23 నెలల ఏరియర్స్ చెల్లింపుల్లో 23 నెలలకు సంబంధించిన పీఎఫ్ షేర్, ఇంకామ్ టాక్స్ బకాయిలు కట్ చేసుకుని మిగతా డబ్బులు చెల్లించనున్నారు. అయితే.. ఒకేసారి పెద్దమొత్తంలో ఏరియర్స్ విడుదల చేయడంపై ఉద్యోగులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు.. ఆదిలాబాద్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో గుర్తింపు పొందిన కార్మిక సంఘం ఎన్నికలు అక్టోబర్ 28న జరగనున్నాయి. అందుకోసం.. అక్టోబరు 7న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. పదో తారీఖున కార్మిక సంఘాలకు గుర్తులు కేటాయించనున్నారు. అయితే.. ఈ ఎన్నికలకు గానూ.. సెప్టెంబర్ 22న షెడ్యూల్ విడుదల కానుంది.